జవాబు చెప్పండి?: చంద్రబాబుకు రోజా 15 ప్రశ్నలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు రోజా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన గురువారం నిప్పులు చెరిగారు. బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదని, కేవలం మేడిపండు చందమే అన్నారు. చంద్రబాబు నిజంగానే అభివృద్ది చేసి ఉంటే ప్రజలు ఎందుకు రెండుసార్లు తిరస్కరించారో చెప్పాలన్నారు. రోజా పదిహేను ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రంలోని ఏ ఇంట్లోనైనా వైయస్ పాలనలో కంటే మీ పాలనలో మెరుగైన ప్రయోజనాలు లభించాయా? హైదరాబాదును అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు... విజయమ్మ పిటిషన్పై కోర్టులో విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. హైదరాబాదులో బాబు చేసిన అభివృద్ధి ప్రభుత్వ సంస్థలను మూసివేసి, ప్రయివేటు వ్యక్తులకు వేలాది ఎకరాలను కట్టబెట్టడమేనా అన్నారు.
ముందు చంద్రబాబు తన వందిమాగధులతో భూములు కొనిపించి.. ఆ తర్వాతే ఆ ప్రాంతాల్లో హైటెక్ సిటీ, విమానాశ్రయాలు ఏర్పాటు ప్రకటించిన విషయం వాస్తవం కాదా అన్నారు. పివిఎన్ఆర్ ఎక్సుప్రెస్ హైవే, ఔటర్ రింగు రోడ్డులకో కొబ్బరికాయ కొట్టడం మినహా బాబు చేసిందేమిటన్నారు. వైయస్ హయాంలోనే అవి పూర్తయ్యాయన్నారు.
నాగార్జున సాగర్ నుండి నీరు హైదరాబాదుకు వచ్చింది వైయస్ హయాంలోనే అన్నారు. చంద్రబాబు సిఎం అయ్యే నాటికి సాఫ్టువేర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంటే... ఆయన దిగిపోయే నాటికి ఏదో స్థానానికి పడిపోవడం నిజం కాదా అన్నారు. వైయస్ హయాంలో 18 విశ్వవిద్యాలయాలు, 3 ట్రిపుల్ ఐటిలు స్థాపింపచేశారన్నారు. చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించారు.