ముసలి చంద్రబాబు, లోకేష్ దానికి తక్కువే, దమ్ముంటే రా: ఊగిపోయిన రోజా
విశాఖ: వైసిపి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పైన విరుచుకు పడ్డారు. యువకుడైన వైయస్ జగన్ ముందు నలబై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు తేలిపోతున్నారని అభిప్రాయపడ్డారు. విశాఖ బీచ్లో బికినీ షోలు అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైసిపి నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో రోజా ప్రసంగించారు. విశాఖ ఉద్యమాల పురిటిగడ్డ అని అందుకే జగనన్న ఇక్కడి నుంచి హోదా కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు.
ప్రత్యేక హోదా పేరుతో మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు వైసిపి ఉద్యమిస్తోందన్నారు. ప్రత్యేక హోదా అనేది ఐదు కోట్ల ఆంధ్రుల తల రాత మార్చే సంజీవిని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు, భవిష్యత్తు తరాలకు తారక మంత్రం అన్నారు.
ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కోసం మనం పోరాడకుంటే మన భవిష్యత్తు తరాలు నాశనం అవుతాయన్నారు. చంద్రబాబు, వెంకయ్య ఆడుతున్న మోసానికి తెర దింపాలన్నారు.
ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ కాబట్టే ఇక్కడి నుంచి హోదా కోసం ఉద్యమిస్తున్నామని, ఉద్యమించే ప్రతి ఒక్కరికి పాదాభివనందనం అన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, పదివేల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు విశాఖలో చెప్పారని, కానీ ఏదీ నెరవేరలేదన్నారు.
టిడిపి నేతలు పక్క రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టారు. కానీ ఏపీలో మాత్రం పెట్టలేదన్నారు. ఇది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏపీకి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలని, ఇది జగన్కు తెలుసు కాబట్టే పోరాడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం రాలేదన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారం నమ్మి నిరుద్యోగులు టిడిపికి ఓటేసారన్నారు. ఇప్పుడు వారు దగాపడ్డారన్నారు. వారికి న్యాయం చేసేందుకు జగన్ హోదా పోరాటం చేస్తున్నారన్నారు. ఈ ఉద్యమంతో టిడిపి మంత్రులు, నేతల వెన్నులో వణుకు పుట్టిందన్నారు.
లోకేష్ కామెడీ ఆర్టిస్టుకు ఎక్కువ, కామెడీ విలన్కు తక్కువ అన్నారు. మండల కమిటీ కూడా తెలియని లోకేష్ వైసిపి గురించి, జగన్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ లేదని లోకేష్ చెప్పడం విడ్డూరమన్నారు.
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని, మీరు చేయిస్తారా అని లోకేష్కు సవాల్ విసిరారు. టిడిపిలో చేరిన 20 మంది వైసిపి ఎమ్మెల్యేల పైన వేటు వేసే దమ్ము ఉందా అన్నారు. మీకు ఉప ఎన్నికలకు వచ్చే సత్తా ఉందా అన్నారు. టిడిపి లేదా బీజేపీ లేదా వారికి మద్దతిచ్చే వారు ఎవరైనా దమ్ముంటే రావొచ్చునని చెప్పారు.
నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రోజు ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. వెంకయ్య, చంద్రబాబులు వెన్నుపోటు, మోసం చేసే బ్రదర్స్ అన్నారు. గుండెల్లో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి పైన చేయి వేసి హోదా కోసం ఉద్యమిస్తామని చెప్పాలన్నారు.