సినిమాల్లోకి, రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చా, అయినా...: రోజా
ఎమ్మెల్యే, సినీ నటి రోజా విద్యార్థులకు హితబోధ చేశారు. తాను అనుకోకుండా రాజకీయాల్లో, సినిమాల్లో అడుగు పెట్టినా రాణించానని చెప్పారు.
కడప: తాను అనుకోకుండానే రాజకీయాల్లోకి, సినిమాల్లోకి ప్రవేశించానని, అయినా కృషీ పట్టుదలతో రెండు రంగాల్లోనూ రాణించానని సినీ నటి, నగరి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా చెప్పారు. విద్యార్థి దశలోనే మంచి భవిష్యతకు పునాదులు వేసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు.
మంగళవారం మాస్టర్స్ జూనియర్ కళాశాల ఫేర్వెల్డేను స్థానిక రాయల్ కౌంటీ రీసార్ట్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగిరి ఎమ్మెల్యే రోజా, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి హాజర్యారు. ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడారు. దేశ భవిష్యతకు విద్యార్థులు చుక్కాని లాంటి వారని, గురువులు విద్యార్థుల భవిష్యతను తీర్చిదిద్దేలా బోధించాలన్నారు. తమ తల్లిదండ్రులు, తాము చదివిన కళాశాల గర్వపడే విధంగా విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిష్టించాలని సూచించారు.

ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కష్టపడటం ద్వారానే ఉన్నత స్థానాలను చేరుకోగలమని, విద్యార్థి దశలో బాధ్యతతో మెలగాలని సూచించారు. డబ్బులు పంచకుండా ఎమ్మెల్యేగా గెలుపొందాలన్నది తన కోరిక అని చెప్పారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యతకు ప్రత్యేక హోదా ఎంతైనా అవసరమన్నారు.
కళాశాల కరస్పాండెంట్, ప్రిన్పిపాల్ మునిభాస్కర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులతో వినూత్న పద్దతులతో కామర్స్ విద్యను విద్యార్థులకు అందిస్తూ, వారి పురోగతికి తోడ్పడుతున్నామన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు రోజా, రాచమల్లు ప్రసాద్రెడ్డిల చేతుల మీదుగా మెడల్స్, మెమోంటోలను బహుకరించారు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టు పెట్టాడని రోజా విమర్శించారు. మంగళవారం ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో జెడ్పీహైస్కూల్ బాలికలకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి రెండు లక్షల సొంత నిధులతో ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో రోజా మాట్లాడారు. డబ్బు ఎలాగైన సంపాదించవచ్చని రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలు ప్రేమించేలా మనం నాయకత్వం అందించాలని అన్నారు. పాఠశాలలో రాజకీయాలు మాట్లాడే పరిస్థితులు నేడురావడం దురదృష్టకరమన్నారు.
ఏ నాయకుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుందో విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే నిరుద్యోగ భవిష్యత్ ఉంటుందని జగన్ 26న హోదాపై ఉద్యమం చేపడుతున్నారని ఇందులో యువత పాల్గొనాలని పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications