కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, తెరపైకి వంగవీటి రంగా: అది మా ఇష్టమని అంబటి!!
అమరావతి: కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెడతామని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వివాదానికి తెరలేపింది. ఎన్టీఆర్ మాస్ లీడర్ అని, ఆయన పేరును ఓ జిల్లాకు పరిమితం చేయడం ఏమిటని కొందరు అంటుంటే, అది సరైనదేనని మరికొందరు అంటున్నారు.
ఈ సమయంలో తెరపైకి వంగవీటి రంగా పేరు కూడా వచ్చింది. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని పలువురు కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జగన్ ప్రకటన చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఎన్టీఆర్ పేరుతో జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ విమర్శిస్తోంది.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు: రాజీనామా చేస్తాం.. జగన్కు సొంత పార్టీ నేతల షాక్
అలా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాం
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రకటనపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఓ ఛానల్తో మాట్లాడారు. తాము కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం కాదని, జిల్లాల విభజన అనంతరం 23 జిల్లాలు అవుతాయని, అందులో మిగతా 12 జిల్లాలకు కొత్త పేర్లు పెడతామని, అందులో నిమ్మకూరు ఉండే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఇన్నాళ్లు ఎందుకు పెట్టలేదు?
తాము ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పాక టీడీపీ నేతలు స్పందిస్తున్నారని, అసలు ఇన్నాళ్లు చంద్రబాబు ఎందుకు ఆ పేరు పెట్టలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. తన మామగారిపై చంద్రబాబుకు అభిమానం ఉంటే జగన్ ప్రకటనను కచ్చితంగా స్వాగతించాలని చెప్పారు.
జగన్ను మెచ్చుకోవాలి
ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ చెప్పినందుకు చంద్రబాబులో మార్పు వస్తే కనుక తమ అధినేతను మెచ్చుకునేవారని అంబటి రాంబాబు అన్నారు. ఆయన మార్పు రాలేదని అభిప్రాయపడ్డారు. మామగారి పేరు పెడితే ఎందుకు ఇంత ఈర్ష అన్నారు. చంద్రబాబు ఆ పేరు పెట్టడు.. మేం పెడతామంటే విమర్శలు చేస్తారా అని నిప్పులు చెరిగారు.
వంగవీటి రంగాను ఎలా మరిచిపోతారు?
మరోవైపు, టీడీపీ నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు, నిమ్మకూరు వాసులు స్పందిస్తూ.. ఎన్టీఆర్ మాస్ లీడర్ అని, ఆయనను ఓ జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అంటున్నారు. జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికల రాజకీయాలు అన్నారు. ఇదిలా ఉండగా, ఇదే జిల్లాకు చెందిన వంగవీటి రంగాను ఎలా మరిచిపోతారని, జిల్లాకు ఆయన పేరు పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్కు గౌరవం ఇవ్వాలనుకోవడం మా ఇష్టం
జగన్కు చేతనైతే ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేలా చూడాలని నిమ్మకూరువాసులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల రాజకీయాలు సరికాదన్నారు. జనం మెచ్చిన నటుడిని ఓ ప్రాంతానికి పరిమితం చేయవద్దన్నారు. ఎన్టీఆర్ జనం మెచ్చిన నేత కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నామని అంబటి చెబుతున్నారు. ఆయనకు గౌరవం ఇవ్వాలనుకోవడం మా ఇష్టమన్నారు.