రైట్స్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతికిచ్చారు, మైక్ రాదు: జగన్
హైదరాబాద్: అసెంబ్లీ ప్రసార హక్కులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చారని, మైకులు పనిచేయవని, టీవీలు పనిచేయవని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబుపై తాము ఆరోపణలు చేస్తే స్పీకర్ సభపై ఆరోపణలు చేసినట్లుగా మాట్లాడుతారని ఆయన అన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటపై సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర రభస జరిగింది. సభా కార్యక్రమాలు స్తంభించాయి.
చంద్రబాబు మాట్లాడిన తర్వాత వైయస్ జగన్ పుష్కర ఘాట్ ప్రమాదంపై మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. జగన్ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలపడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
గోదావరి పుష్కర ఘాట్ ప్రమాదంపై చర్చ జరుగుతుందని, సంతాప తీర్మానానికి పరిమితం కావాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ జగన్కు సూచించారు. రాజమండ్రి పుష్కర ఘాట్ మృతులకు చంద్రబాబు సంతాపం ప్రకటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జగన్ అంతకు ముందు అన్నారు. సాక్షాత్తు దగ్గర ఉండి చంద్రబాబు 29 మంది మృతికి కారణమయ్యారని ఆయన ఆరోపించారు. విఐపి ఘాట్ వద్ద చంద్రబాబు స్నానం చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.
పబ్లిసిటీ కోసం షూటింగ్ పెట్టుకుని తాను బాగా కనిపించాలని మేకప్ వేసుకుని వచ్చి సామాన్యుల ఘాట్ వద్ద చంద్రబాబు స్నానం చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. వారి చావుకు కారణమైన చంద్రబాబు ఇవాళ నివాళులు అర్పిస్తూ ఉంటే ఏమనాలో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సంతాప సందేశం ఇవ్వడం మాని జగన్ ఫాక్షన్ సందేశం ఇస్తున్నారని మంత్రి యనలమ రామకృష్ణుడు అన్నారు. సంతాప సందేశంలో ఆ విషయాలు మాట్లాడకూడదని, సంతాపం ప్రకటించడానికే పరిమితం కావాలని ఆయన అన్నారు.
మైకులు కట్ చేసి, మాట్లాడమంటారని, ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం మరోటి ఉండదని జగన్ అన్నారు. సభను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల సూచించారు. సంతాప తీర్మానంపై మాట్లాడాలి గానీ సభపై వ్యాఖ్యలు చేయకూడదని ఆయన అన్నారు. ఆ తర్వాత మాట్లాడిన టిడిపి సభ్యుడు సూర్యారావు జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శవరాజకీయాల మీద ఏర్పడిందని ఆయన అన్నారు.