జగన్ హైదరాబాద్ సమైక్య శంఖారావం సభ చిచ్చు
హైదరాబాద్: హైదరాబాదులో ఈ నెల 19వ తేదీన సమైక్య శంఖారావం సభ పెట్టాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయం వివాదానికి దారి తీసింది. జగన్ సమైక్య శంఖారావం సభ పెట్టాలనే నిర్ణయాన్ని అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్లో సమైక్య శంఖారావం సభ పెడితే మరో మానుకోట సంఘటన పునరావృతమవుతుందని తెలంగాణ ప్రజా, సామాజిక తెలంగాణ, బీసీ సంఘాల, ఓయూ జేఏసీలు హెచ్చరించాయి.
హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివిధ జేఏసీల చైర్మన్లు గజ్జెల కాంతం, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, ఓరుగంటి వెంకటేషం గౌడ్, శ్రీనివాస్యాదవ్, అంజియాదవ్, అంజిబాబులు మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం పేరుతో నగరంలో సభ పెడితే యుద్దమే జరుగుతుందని.. మానుకోట సంఘటన పునరావృతమవుతుందని గజ్జెల కాంతం హెచ్చరించారు.
ఒక వేళ యుద్ధ్దమే జరిగితే దానికి జగన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిలే కారణమవుతారన్నారు. ఇది కడప కా దు.. హైదరాబాద్ నగరమన్నారు. సమైక్యవాదం పేరుతో సీమాం ధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. మాటిమాటికి నీటి సమస్యలు వస్తాయని అంటున్నారని, వాటిని పరిష్కరించడానికి జలసంఘం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తున్నది విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాలేనన్నారు.
సమైక్యవాదం పేరుతో జరుగుతున్న ఉద్యమం పూర్తిగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో నడుస్తున్నదని గాలి వినోద్కుమార్ అన్నారు. విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి నిజమైన నాయకులన్నారు. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామనేది దగా అన్నారు. బడుగు, బలహీనవర్గాలను అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని వెంకటేషం గౌడ్ అన్నారు. విద్యార్థి నాయకత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర చేస్తున్నారని అంజియాదవ్, అంజిబాబులు అన్నారు. ఇటీవల జరిగిన సకలజనుల భేరి సభలో విద్యార్థి నాయకులను మా ట్లాడించకపోవడమే దీనికి ఉదాహారణ అన్నారు.
వరంగల్ జిల్లా మహబూబాబాద్లో మంగళవారం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమైక్యవాది జగన్ హైదరాబాద్లో సభ పెడతానన్న వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్లో తెలంగాణ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో నిరసన చేశారు. జగన్ పేపర్ చదవకూడదు, చూడకూడదు, వినకూడదు అనే ఫ్లకార్డులను ముందు పెట్టి చిన్నారులు నోరు, కళ్లు, చెవులు మూసుకొని వినూత్న నిరసన తెలియజేశారు.
హైదరాబాద్లో సభ పెడితే ఊరుకునేది లేదని తెలంగాణ నవ నిర్మాణ సేన జిల్లా అధ్యక్షుడు కమ్మగాని కృష్ణమూర్తి హెచ్చరించారు. హైదరాబాద్లో సమైక్యాంధ్ర సభ పెడతానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తెలుగుదేశం తలంగాణ నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి నాయకులు కూడా జగన్ సమైక్య శంఖారావం సభను వ్యతిరేకిస్తున్నారు. మహబూబాబాద్ సంఘటనను పునరావృతం చేయాలని జగన్ కోరుకుంటున్నారా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు.
జగన్ హైదరాబాదులో సభ పెడితే మహబూబాబాద్ సంఘటన పునరావృతం అవుతుందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. హైదరాబాదులో జగన్ సభ పెడితే అడ్డుకుంటామని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ సభ పెడుతున్నారని బిజెపి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని, ఇందుకు మిగతా పార్టీలు కలిసి రావాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.