గోదావరికి మళ్ళీ వరద ముప్పు అన్నఆర్టీజీఎస్ .. ఏపీలో భారీ వర్షాలు అంటున్న వాతావరణ శాఖ
గోదావరి నదికి వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆర్టీజీఎస్ మళ్లీ వరద సూచన చేసింది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తగా పోలవరం సమీప గ్రామాలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అపార పంట నష్టం జరిగింది. ఇక మొన్నటి వరద ప్రభావం నుండి కోలుకోకముందే, మరోసారి గోదావరి నదికి వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆర్.టి.జి.ఎస్ హెచ్చరిస్తోంది.
నేటి నుంచి మూడు రోజులపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు ఆర్టీజీఎస్ అధికారులు చెప్తున్నారు. దీంతో మరోసారి వరదలు అంటూ వస్తున్న వార్తలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఒక పక్క కృష్ణా నదికి కూడా వరద నీరు పోటెత్తిన నేపద్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లను తెరిచి నీటిని సముద్రంలోనికి విడిచిపెట్టారు. దీంతో కృష్ణా నది వరదల ప్రభావం వల్ల కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో పలు గ్రామాలు ముంపుకు గురై జనజీవనం అతలాకుతలమైంది. ఇక ఈ నేపథ్యంలో కృష్ణానది వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీ అని నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను ప్రభుత్వం అందివ్వనుంది.

ఇదిలా ఉంటే జార్ఘండ్, బీహార్ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. దీంతో ఏపీ లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం ప్రకటించటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు..












Click it and Unblock the Notifications