కొత్త వైరస్ విషప్రచారం వల్లే ఇదంతా .. చంద్రబాబుపై కేసులు పెట్టాలి : సజ్జల ఫైర్
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై,కరోనా కట్టడిపై టిడిపి అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు విష ప్రచారాన్ని తట్టుకోలేక పోతున్నామని ప్రభుత్వ సలహాదారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు వల్లనే తెలుగురాష్ట్రాల ప్రజలపై ఆంక్షలు విధించారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై ఇతర రాష్ట్రాల ఆంక్షలకు చంద్రబాబే కారణం
కరోనా కొత్త వేరియంట్ అంటూ అసత్య ప్రచారాలు చేసినందువల్ల ఇతర రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిర్బంధాన్ని విధించాయని అసహనం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.పక్క రాష్ట్రంలో కూర్చొని అసత్య ప్రచారం చేస్తూ ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ప్రజలను భయాందోళనకు గురి చేయడం వల్ల చంద్రబాబుకు ఒరిగే లాభం ఏంటి అని ప్రశ్నించిన సజ్జల రామకృష్ణారెడ్డి, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది అంటూ వ్యాఖ్యానించారు.

ఎన్440కే వేరియంట్ వ్యాప్తి పేరుతో చంద్రబాబు అభూతకల్పనలు
ఎన్440కే వేరియంట్ వ్యాప్తి అని అభూతకల్పనలు చంద్రబాబు సృష్టించారని, రాజకీయాల కోసమే చంద్రబాబు ఇలా చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరోనా కట్టడి లో ఫెయిల్ అయిందని చూపించడం కోసం చంద్రబాబు విష ప్రచారాలకు దిగుతున్నారన్నారు. ఎన్ 440కే వైరస్ అత్యంత ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, అయినా ఇది ఏపీలో పుట్టిన వైరస్ కాదని పేర్కొన్నారు. కేరళ లాంటి రాష్ట్రాలలో ఈ వేరియంట్ చాలా రోజుల నుంచే ఉందని సీసీఎంబీ చెబుతోందని, కానీ కొత్తగా చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా దీని పై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.

ప్రభుత్వం ఏ మంచిపని చేసినా సరే విమర్శించటం చంద్రబాబు అలవాటు
సిసిఎంబి, సెంట్రల్ బయోటెక్నాలజీలు ఈ వేరియంట్ వల్ల ప్రమాదం లేదని ఇప్పటికే స్పష్టం చేశాయని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు ప్రభుత్వం ఏ పని చేసినా సరే విమర్శించటం అలవాటుగా మారిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలని, ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సలహా ఇవ్వాల్సింది పోయి, ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని హితవు పలికారు.

చంద్రబాబు చేస్తున్న విష ప్రచారంపై కేసులు పెట్టాలి, బాబును నిలదీయాలి
చంద్రబాబు చేస్తున్న విష ప్రచారంపై కేసులు పెట్టాలని, ప్రజలు ఎక్కడికక్కడ బాబును నిలదీయాలని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి . ఇదే సమయంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని, వ్యాక్సిన్ డోసులు కావాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి సీఎం లేఖలు రాస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు వ్యాక్సిన్లు ఎవరి నియంత్రణలో ఉన్నాయో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రతీ దానికి రాద్ధాంతం చేస్తున్నారు
కేంద్రం సరిపడా డోసులు ఇస్తే అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు మార్లు కేంద్రానికి లేఖలు రాశామని, వ్యాక్సిన్ డోసులు రాగానే అందరికీ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.ప్రతిదానికి రాద్ధాంతం చేయడం చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి దిగుమతి నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు, వారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications