ఎన్డీఏలో ఎప్పుడో చేరమన్నారు.. పొత్తు వద్దనుకున్నాం: మోడీ - జగన్ సంబంధాలపై సజ్జల కీలకవ్యాఖ్యలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఈ ఇంటర్వ్యూలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, జగన్ కు ఉన్న సంబంధాలను గురించి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి అత్యంత విధేయుడిగా ప్రవర్తిస్తారని రాజకీయ వర్గాలలో ఒక టాక్ ఉంది. ప్రధాని మోడీ పైన కానీ, కేంద్ర ప్రభుత్వం పైన కానీ ఎన్నడు జగన్ ఒక విమర్శ కూడా చేయరన్న అభిప్రాయం ఉంది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగానే మాట్లాడి వెళ్లారు.

దీంతో జగన్ మోడీ సంబంధాలపై చర్చ జరుగుతున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కేవలం ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు మాత్రమే కొనసాగించారని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో అవసరం మేరకు సత్సంబంధాలను కొనసాగించారని అన్నారు.
ఎన్డీఏలో చేరాలని తమకు ఆహ్వానం ఎప్పుడో వచ్చిందని, కానీ పొత్తు వద్దనుకున్నాము కాబట్టే ఎన్డీఏ లో చేరలేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎన్డీఏ తో పొత్తు పెట్టుకుంటే కలిసి పోటీ చేస్తే తేడాలు వస్తాయి అన్న ఉద్దేశంతోనే తాము పొత్తు ఆలోచన చేయలేదన్నారు. గతంలో మోడీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, బయటకు వచ్చిన తర్వాత మోడీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారని,అయితే తామలా మాట్లాడలేమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక రాజకీయ విభేదాలను, కుటుంబ విభేదాలుగా మార్చి చూపించి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు వంటి వారు చూస్తున్నారని, జగన్ కు, షర్మిలకు మధ్య ఉన్నవి కేవలం రాజకీయపరమైన విభేదాలు మాత్రమేనన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో షర్మిల ప్రభావం ఉండబోదని చెప్పారు. వైయస్సార్ కుటుంబంలో గొడవలు లేవని, షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేశారన్నారు. షర్మిల అంటే జగన్ కు ఒక అన్నగా ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ ఉందని సజ్జల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications