మేకపాటి కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చిన వైఎస్ జగన్: మంత్రి అంబటి రాంబాబు హయాంలో
నెల్లూరు: గుండెపోటుతో కన్నుమూసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును చిరస్మరణీయం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదివరకు ఆయన కుటుంబానికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు. ఇదే హామీని నిండు అసెంబ్లీలో సైతం ఆయన ప్రస్తావించారు. ఇప్పుడది వాస్తవ రూపాన్ని దాల్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల అయ్యాయి. జలవనరుల మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేసింది.
సంగం బ్యారేజీకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జలవనరుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా పేరు మార్చారు. అంబటి రాంబాబు చేతికి జల వనరుల మంత్రిత్వ శాఖ అందిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన హయాంలో తీసుకున్న తొలి నిర్ణయం ఇదే.
మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహించిన ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని సంగం మండలం సమీపంలో.. పెన్నానదిపై దీన్ని నిర్మించారు. దీన్ని నిర్మించారు. మశిల ప్రాజెక్ట్కు దిగువన ఉంటుందీ బ్యారేజీ. 21,240 క్యూమెక్స్ మేర నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అయిదు మండలాల పరిధిలో సుమారు 78 గ్రామాలకు మంచినీరు, సాగునీటి అవసరాలను తీర్చుతుంది. సంగం బ్యారేజ్ ఆయకట్ పరిధిలో దాదాపుగా లక్షన్నర హెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో సోమశిల తరువాత చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఇదే.
దీనికి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతానని వైఎస్ జగన్ ఇదివరకే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగంగా ఈ ప్రకటన చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైన రెండో రోజే సభలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను వైఎస్ జగన్ స్మరించుకున్నారు.
తనకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడని..ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకుని రావడంలో గౌతమ్రెడ్డి కీలక పాత్ర పోషించారని నివాళి అర్పించారు. అప్పటి హామీని ఆయన నెరవేర్చారు. సంగం బ్యారేజీకి మేకపాటి పేరు పెట్టారు. కాగా- తాజాగా చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా జల వనరుల శాఖ అంబటి రాంబాబు చేతికి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది.