విశాఖ: జీవీఎంసీ ఎన్నికల్లో కలకలం -బ్యాలెట్ బాక్సుల్లో ‘సేవ్ స్టీల్ ప్లాంట్’ స్లిప్పులు -నేరమన్న కలెక్టర్
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు నెలరోజులుగా సాగుతోన్న ఉద్యమ సెగ ఎన్నికలనూ తాకింది. రాష్ట్రంలోని మరో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలతోపాటే బుధవారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లోనూ పోలింగ్ జరగ్గా.. ఉద్యమకారులు, ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.
విశాఖ ఉక్కుపై సంచలనం: ఉద్యమానికి తెలంగాణ మద్దతు -రాష్ట్ర ప్రభుత్వాలనూ మోదీ అమ్మేస్తాడు: KTR
బ్యాలెట్ బాక్సుల్లో ఆ స్లిప్పులు..
మంచు మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' సినిమాలో.. విలన్ కు భయపడే జనం.. హీరో తప్పు చేయలేదంటూ స్లిప్పులను రాసి ఎన్నికల బ్యాలెట్ బాక్సుల్లో వేస్తారు. సరిగ్గా అలాంటి ఘటనలే ఇవాళ జీవీఎంసీ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతోపాటు ఉద్యమానికి మద్దతిస్తోన్న చాలా మంది జీవీఎంసీ ఎన్నికల్లో 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్' అని రాసిన స్లిప్పులను ఓటుతోపాటే బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ఈ విషయాన్ని..
ఆవేదన తెలిపేందుకే..
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటుతోపాటు 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్'అని రాసున్న స్లిప్పులను బ్యాలెట్ బాక్సులో వేశామని పలువురు ఉద్యోగులు, కార్మికులు మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా 68వ డివిజన్ సహా జీవీఎంసీ వ్యాప్తంగా ఇలానే జరిగి ఉంటుందని తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడేందుకు ప్రజలంతా 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్' స్లిప్ను జత చేయాలని ఉద్యోగులు, నిర్వాసితులు పిలుపునివ్వడం, గాజువాక, వడ్లపూడి ప్రాంతాల్లో స్లిప్పుల్ని పంచిపెట్టడంతో ఈ మేరకు స్పందన వచ్చింది. సుమారు నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడంలేదని, అందుకే ఓటు హక్కుద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని కొందరు వ్యాఖ్యానించారు. అయితే..
స్టీల్ ప్లాంట్ స్లిప్పులపై కలెక్టర్ సీరియస్
పెద్ద సంఖ్యలో ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో 'సేవ్ స్టీల్ ప్లాంట్' స్లిప్పులు వేయడంపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సుల్లో ఇతర స్లిప్పులు వేయడం నేరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏమైనా డిమాండ్ ఉంటే అందుకు వేరే వేదికలు ఉన్నాయని, బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేయడం సరికాదని అన్నారు. ఇతర స్లిప్పులు వేసిన బ్యాలెట్ బాక్సుల లెక్కింపుపై ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది.