చంద్రబాబు బెయిల్ కు సుప్రీం నో ! స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్..!
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తన అరెస్టు, రిమాండ్ ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. గత విచారణకు కొనసాగింపుగా సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ ఇవాళ కూడా వాదనలు వినిపించారు. అనంతరం చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే కూడా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.

స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఇవాళ కూడా ముకుల్ రోహత్గీ, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్ని, ఐపీసీ, సీఆర్పీసీల్ని ఉదహరించారు. నేరం జరిగిన సమయానికి సెక్షన్ 17ఏ వర్తింపచేయవచ్చా లేదా అన్న దానిపై న్యాయమూర్తులు కూడా తమ అభిప్రాయాలు తెలిపారు. దీంతో స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిసినట్లయింది.
అనంతరం సుప్రీంకోర్టుకు దసరా సెలవుల్ని దృష్టిలో ఉంచుకుని క్వాష్ పిటిషన్ లో రెండో వాదన అయిన మధ్యంతర బెయిల్ ను పరిశీలించాలని ఆయన లాయర్ హరీష్ సాల్వే కోరారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును 40 రోజులుగా జైలులో ఉంచారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. అయితే చంద్రబాబు లాయర్ సాల్వే విజ్ఞప్తి మేరకు రాతపూర్వకంగా బెయిల్ పై వాదనలు సమర్పించేందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది.
స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పును వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అదే రోజు మధ్యంతర బెయిల్ పైనా వాదనలు వినేందుకు అంగీకరించింది. అలాగే ఫైబర్ నెట్ కేసులోనూ మధ్యంతర బెయిల్ పై అదే రోజు వాదనలు వినడంతో పాటు ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.












Click it and Unblock the Notifications