రహస్య నివేదిక: హైదరాబాద్పై, 371డిపై అస్పష్టతే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కసరత్తులో భాగంగా మూడోసారి కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) గురువారం జరిగింది. ఈ సమావేశానికి కూడా రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హాజరు కాలేదు. అయితే, ప్రభుత్వ శాఖల నుంచి, పార్టీల నుంచి అందిన నివేదికలను ఈ సమావేశంలో పరిశీలించారు. హైదరాబాద్ స్థితిపై, జోనల్ వ్యవస్థకు సంబంధించిన 371డిపై ఇంకా స్పష్టతకు రాలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సమావేశానంతరం చెప్పారు.
సరైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును మంత్రివర్గానికి పంపుతామని ఆయన చెప్పారు. సీమాంధ్రకు అందించే ప్యాకేజీని కూడా బిల్లులో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. తమకు 18 వేల నివేదికలు అందినట్లు ఆయన తెలిపారు. జివోఎం వరుసగా తన సమావేశాల తేదీలను ఖరారు చేసుకుంది. నెలాఖరులోగా జివోఎం కసరత్తు పూర్తవుతుందని ఆయన చెప్పారు.
మిగతా మూడు పార్టీలకు కూడా పిలుపు
ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర రాజకీయ పార్టీలతో సమావేశాలను 12వ తేదీకి కుదించి ఐదు పార్టీలను మాత్రమే ఆహ్వానించినట్లు, మరో మూడు పార్టీలను ఆహ్వానించలేదని ఇంతకు ముందు సమాచారం అందింది. జివోఎంకు నివేదికలు సమర్పించిన కాంగ్రెసు, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), మజ్లీస్ పార్టీలకు, నివేదిక అందించడానికి సిద్ధపడిన బిజెపికి మాత్రమే కేంద్ర హోంశాఖ ఆహ్వానాలు అందించింది. అయితే, తాజాగా మిగతా మూడు పార్టీలను కూడా ఆహ్వానించింది.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలకు కేంద్ర హోం శాఖ గురువారం ఆహ్వానాలు పంపింది. దీంతో రాజకీయ పార్టీలతో సమావేశాలను ఈ నెల 13వ తేదీన కూడా జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు గురువారం ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఒక్కో పార్టీకి 20 నిమిషాల వ్యవధిని కేటాయించారు. కాగా, ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులు మాత్రమే వస్తే మంచిదని హోం శాఖ తెలిపింది.
రాజకీయ పార్టీలతో సమావేశాలకు ముందు జివోఎం ఈ నెల 11వ తేదీన ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశం కానుంది. కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మంత్రులతో జివోఎం ఈ నెల 18వ తేదీన సమావేశం కానుంది.
గవర్నర్తో కిరణ్ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రేపు (శుక్రవారం) ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతున్న తురణంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తుపై కూడా పలు విధాలుగా ప్రచారం సాగుతోంది.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు గురువారం ఇచ్చిన అపాయింట్మెంట్ను ప్రధాని మన్మోహన్ సింగ్ రద్దు చేసుకున్నారు. వారు గురువారంనాడు కేంద్ర మంత్రులు పి. చిదంబరం, వీరప్ప మొయిలీలతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన ఖాయమని నిర్ధారించుకున్న వాళ్లు సీమాంధ్రకు కావాల్సిన విషయాలను వివరించినట్లు సమాచారం.
హోంశాఖ రహస్య నివేదిక
ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం జరిగే పరిణామాల గురించి, అందుకు తీసుకోవలసిన సత్వర చర్యల గురించి కేంద్ర హోం శాఖ మంత్రివర్గానికి ఒక రహస్య నివేదికను సమర్పించిందని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలిపింది. ఈ మేరకు ఆ టీవీ చానెల్ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆ నివేదిక తమ వద్ద ఉందని కూడా చెప్పుకుంది. దీన్ని హైదరాబాద్ వచ్చిన అభిప్రాయాలు సేకరించిన విజయ్ కుమార్ నేతృత్వంలోని టాస్క్పోర్స్ సమర్పించిన నివేదికగా చెబుతున్నారు.
ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం - హైదరాబాద్లో స్థిర పడిన సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని ఈ నివేదికలో కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలో తెలంగాణ జెఎసి నాయకులు ఇచ్చిన నినాదాల వల్ల హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న సీమాంధ్రులలో భయాందోళనలు నెలకొన్నాయని, అందువల్ల ఆ భయాందోళనలను తొలగించవలసిన అవసరం ఉందని ఈ నివేదికలో అభిప్రాయపడినట్లు సమాచారం.
అలాగే ప్రయివేటు రంగంలోను, ప్రభుత్వ రంగంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ కూడా కేంద్ర హోం శాఖ తమ సొంత సమగ్ర పరిశోధన జరిపి సూచనలు అందించింది. ఇరు ప్రాంతాలలోనూ మావోయిస్టు సమస్యలు, తదితర సమస్యలు తలెత్తుతాయని, అయితే అందుకు తగిన విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలని విజయకుమార్ నాయకత్వంలోని హోం శాఖ టాస్క ఫోర్స్ బృందం తమ నివేదికలో పొందుపరిచినట్లు ఆ వార్తాకథనం సారాంశం.