'పవన్ కళ్యాణ్ హటావో - పొలిటిక్స్ బచావో' రచయితకు రక్షణ
హైదరాబాద్: 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తక రచయితకు రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. ఈ పుస్తకాన్ని రాసిన సికింద్రాబాదులోని తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ బుధవారం నుంచి 26వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో పుస్తకాలను కూడా ప్రదర్శించి విక్రయిస్తారు.
ఈ నేపథ్యంలో పవన్తో పాటు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ సోమవారం సచివాలయంలో హోంమంత్రిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని ఆయన శ్రీనివాస్కు హామీ ఇచ్చారు. దానికితోడు, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డికి నాయని నర్సింహా రెడ్డి సమాచారం అందించారు. మహేందర్రెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. రక్షణ కల్పించినందుకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్లో మే నెలలో ఆ పుస్తకాన్ని బొగ్గుల శ్రీనివాస్ ఆవిష్కరించారు పవన్పై తాను ఎందుకు పుస్తకం రాయాల్సి వచ్చిందో ఆ తర్వాత వివరణ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం లాంటి పదవులన్నీ తుచ్ఛమైనవని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన పవన్ రాజ్యాంగబద్ధమైన పదవులు తుచ్ఛమైనవి అంటూనే తనకు నచ్చిన పార్టీలను అందలం ఎక్కించాలని అభిమానులకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని అప్పట్లో ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయాలలో ఉండేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికల నియమావళి వచ్చినప్పుడే పవన్ కూడా కోడై కూస్తాడని విమర్శించారు. ఆయన ప్రసంగాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పవన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం తన పుస్తకాలకు మరిన్ని భాగాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. పవన్ ఓ కుహనా రాజకీయవేత్త, కుహనా ఉద్యమకారుడు, కుహనా సంస్కర్త అని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications