టీడీపీకి జగన్ మాస్టర్ స్ట్రోక్- వైసీపీలో చేరిన ఆనం
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 145వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించారు. సర్వేపల్లి మీదుగా నెల్లూరు రూరల్లో ఎంట్రీ ఇచ్చారు.
వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నారా లోకేష్కు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, ఉదయగిరి.. వంటి నియోజకవర్గాల నుంచి వారంతా తరలి వచ్చారు.

ఈ పరిస్థితుల మధ్య- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాకే చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆ సమయంలో ఆయన వెంట నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆనం జయకుమార్ రెడ్డి.. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీలో చేరారు.

నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. తన కుటుంబానికే చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నప్పటికీ- జయకుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆనం జయకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీగా అపాయింట్ చేసిన నేపథ్యంలో- ఆయన స్థానంలో ఆనం జయకుమార్ రెడ్డికి నెల్లూరు లోక్సభ టికెట్ ఇవ్వొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications