నా రాజీనామాను వెంటనే ఆమోదించండి: చంద్రబాబుకు మాజీ మంత్రి లేఖ
Gollapalli Surya Rao: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.
ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు. ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదే బాటలో ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి పంపించారు.
ఈ రాజీనామా లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారాయన. తన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. గతంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పని చేశానని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా పార్టీకి గానీ, చంద్రబాబుకు గానీ ఎలాంటి ఇబ్బందులను కలిగించకుండా వ్యవహరించానని, పార్టీ గౌరవాన్ని ఇనుమడింపజేశానని పేర్కొన్నారు.
2019 నుంచి టీడీపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడిగా, రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జీగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిబద్ధత, క్రమశిక్షణతో మసలుకున్నానని, పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టానని గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చూసుకున్నానని చెప్పారు.

అయినప్పటికీ- ఇటీవల విడుదల చేసిన 94 మంది అభ్యర్థల జాబితాలో తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందని గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగిన పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని, తెలుగుదేశానికి, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తోన్నానని అన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందే గొల్లపల్లి సూర్యారావు.. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలతో టచ్లోకి వెళ్లారు. ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కేశినేని నానిలను కలిశారు. వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సాయంత్రమే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని అంటున్నారు.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు.. గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ.. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications