టీడీపీకి మాజీ మంత్రి గుడ్బై: వైసీపీలో బిగ్ ఆఫర్
Gollapalli Surya Rao: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.
ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు. ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదే బాటలో ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీకి గుడ్బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొంటారనే ప్రచారం జరగుతోంది. ఈ సాయంత్రమే ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని అంటున్నారు.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు.. గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ.. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో మట్టికరిచారు.
వచ్చే ఎన్నికల్లో రాజోలు టికెట్.. గొల్లపల్లికి దక్కేలా లేదు. తన కూతురికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. అది కూడా సాధ్యపడకపోవచ్చంటూ టీడీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో- పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన ఇంటి ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
త్వరలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటోన్నారని తెలుస్తోంది. వైసీపీలోకి వస్తే అమలాపురం లోక్సభ టికెట్ను గొల్లపల్లికి కేటాయిస్తారని సమాచారం. ఈ ఆఫర్ తోనే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications