ఆ రోజే అరాచకం, చెప్పుకోలేక: రిషికేశ్వరి మృతిలో షాకింగ్, గంటా హెచ్చరిక
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రిమాండ్ డైరీలో పలు అంశాలు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ప్రెషర్స్ డే నాడే రిషికేశ్వరితో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు..., ప్రెషర్స్ డే (మే 18) నాడే రిషికేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించారు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చిత్రహింసలు పెట్టారు.
ముగ్గురిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. వేధింపులను రిమాండ్ డైరిలో వివరించారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. పలుమార్లు అవమానించి, చిత్రహింసలు పెట్టారు.
రిషికేశ్వరి తన పైన సీనియర్స్ చేసిన అరాచకాలను తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది. బాగా కుంగిపోయింది. జూలై 14వ తేదీన రూమ్మెట్స్ సుజాత, కుసుమలత బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఫ్యాన్కు ఉరేసుకుంది. వారు వచ్చేసరికి ఆమె ఫ్యాన్కు వేలాడుతోంది.
వారు గదికి వచ్చి ఆమెను చూసి, వెంటనే మధ్యాహ్నం 2.36 గంటలకు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే రిషికేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విద్యార్థినీలు హాస్టల్కు సమాచారం అందించారు.
గంటా శ్రీనివాస రావు హెచ్చరిక
రిషికేశ్వరి మృతిలో దోషులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం విశాఖలో చెప్పారు. విశ్వవిద్యాలయాలు అరాచక శక్తులకు అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.