రఘురామ కేసులో సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశం...
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతోనే నాలుగేళ్లుగా విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై గతంలో వైసీపీ సర్కార్ రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో సమాజంలో కులాలు, వర్గాల మధ్య వైషమ్యాల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ గతంలో కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేసింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ ఆరోపించడం, దాన్ని కోర్టులు నిర్ధారించడం కూడా జరిగిపోయింది.
అయితే ఈ వ్యవహారంలో ఇవాళ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత జరిగిన ఈ కేసు విచారణలో సీబీఐకి హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామ లాయర్ విజ్ఞప్తి మేరకు హైకోర్టు సీబీఐకి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రఘురామపై కస్టడీలో హింస జరిగిన సమయంలో నమోదైన కాల్ డేటా ఈ కేసులో కీలకమని ఆయన లాయర్ వాదించారు. ఈ డేటా నమోదైన రెండేళ్లు మాత్రమే ఉంటుందని లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో కాల్ డేటా భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.

రఘురామకృష్ణంరాజును అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాల్ డేటాను వెంటనే సేకరించాలని ఆదేశించింది. తన కస్టోడియల్ టార్చర్ పై సీబీఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేయగా.. ఈ రోజు అది విచారణకు వచ్చింది. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామకృష్ణం రాజు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్దించారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సిఐడీ వద్ద ఉందని అందువల్ల కాల్ డేటాను సీఐడీ సేకరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ హరినాధ్ వాదించారు. పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే... అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. కానీ సీఐడీని కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని సీఐడీ తరపు న్యాయవాది కూడా వాదించారు. దీంతో సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ ను ఇంకా అనుమతించలేదని పేర్కొన్న హైకోర్టుదీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని ఆదేశించింది.
కేసు విచారణ ను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications