ఏపీలో రెడ్ జోన్ బేఖాతరు- యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన- సర్కారుకు నివేదిక..
ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలను జనం పట్టించుకోవడం లేదని ఇప్పటికే విమర్శలు రాగా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా రెడ్ జోన్లలో నిబంధనలు పాటించేందుకు జనం అస్సలు ఇష్టపడటం లేదని తాజాగా వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేలింది. పలుచో్ట్ల రెడ్ జోన్ల నిబంధనల ఉల్లంఘనతో పాటు పారిశుద్ధ చర్యలు కూడా సక్రమంగా లేవని నివేదిక తేల్చింది. జిల్లాల వారీగా ఇచ్చిన ఈ నివేదికలో పలుచోట్ల దారుణమైన లోపాలు బయటపడ్డాయి.

రెడ్ జోన్ల బేఖాతర్... యథేచ్ఛగా ఉల్లంఘనలు
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన కరోనా రెడ్జోన్లలో నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదుచాలాచోట్ల బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ సరిగా లేదు.వ్యక్తిగత దూరం పాటించకపోవడం, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు గుమిగూడటం, వైద్య సిబ్బంది సక్రమంగా శాంపిల్స్ సేకరించకపోవడం, జోన్ లోపలికి, బయటకువెళ్లే మార్గాలవద్ద థర్మల్ స్కానింగ్ నిర్వహించకపోవడం, ఇళ్ల వద్దకు కూరగాయలు, నిత్యావసరాల సరఫరా సక్రమంగా లేకపోవడంలాంటి ఉల్లంఘనలున్నాయి.11 జిల్లాల్లో రెడ్జోన్లలో పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది.

బ్లీచింగ్ సరఫరా లేదు, చల్లేవారూ లేరు..
విశాఖపట్నం రెడ్జోన్లలో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ సరఫరా సక్రమంగా లేదు. ఉదయం వేళల్లో మొబైల్ రైతు బజార్లను పంపించడంలో జాప్యం జరుగుతోంది.
కూరగాయల ధరలు అధికంగా ఉంటున్నాయి. గాజువాకలో ఈ నెల 13న డీమార్ట్ మొబైల్ బజార్ ఏర్పాటు చేయగా ఈ సేవలు నిలిచిపోయాయి. సేవల ఛార్జీల కింద అదనంగా 10శాతం వసూలు చేయడంపై ప్రజల అసంతృప్తి.రెండు రోజులకు ఒకసారి సరఫరా చేసే కూరగాయల కోసం ప్రజలు బయటకు వస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని గుండుగొలనులో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ సరిగా జరగడం లేదు. ఏలూరులో ప్రతి రోజు స్థానికులు కూరగాయలు, నిత్యావసరాల కోసం రెడ్జోన్ ప్రాంతం నుంచి వచ్చి వెళ్తున్నారు. ఉండిలోని బాలాజీరావుపేటలో రెడ్జోన్ బ్యారికేడ్లను దాటి కొందరు మహిళలు బట్టలు ఉతకడానికి కాల్వ వద్దకు వెళ్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు..

యథేచ్ఛగా వాహనాలు, ధర్మల్ స్కానింగ్ లేదు..
విజయవాడలోని రెడ్జోన్లలో వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. చాలాచోట్ల వైద్య బృందాలు నమూనాలు(శాంపిల్స్) స్వీకరించడం లేదు. లోపలికి, బయటకు వెళ్లే మార్గాల్లో థర్మల్ స్కానింగ్ చేయడం లేదు.
సీతారాంపురంలో పాలు, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం లేదు.
గుంటూరు జిల్లాలో కూరగాయలు, పాలు సరఫరా సక్రమంగా లేదు.
నెల్లూరులో నిత్యావసరాల సరఫరా లేదు. సరకుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నవారు వ్యక్తిగత దూరం పాటించడం లేదు.
కడప జిల్లా రెడ్జోన్లోని పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు గుమిగూడుతున్నారు. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ పిచికారి నిత్యం జరగడం లేదు.
ఔషధాలు, పాలు, ఇతర సరకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కూరగాయలు, నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నివేదికలో తేలింది.

మందులకూ ఇబ్బందే...
కర్నూలు జిల్లాలో నంద్యాల పట్టణం, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లో ఔషధాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
బనగానపల్లెలో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ పిచికారి సరిగా చేయడం లేదు. శిశువులకు టీకాలు వేసేందుకు వైద్యులు ముందుకు రాకపోవడంతో తల్లులు ఇబ్బందులు పడుతున్నారు.
పాణ్యంలో నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలను మూసివేశారు.
అనంతపురంలో బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ ద్రావణం సక్రమంగా పిచికారీ చేయడం లేదు. హైపోక్లోరైట్ను తగిన మోతాదులో కలపడం లేదు.
చిత్తూరులోని నగరిలో ఔషధాల కొనుగోలుకు ఇతర ప్రాంతాలకు చెందిన వారు రెడ్జోన్లోకి వస్తున్నారు.
పలమనేరులో కూరగాయల కొనుగోళ్ల వద్ద వ్యక్తిగత దూరం పాటించడం లేదు.
శ్రీకాళహస్తిలో అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications