గుంటూరులో మొండెం లేని తల లభ్యం: పాణ్యం రైల్వేస్టేషన్లో ఇద్దరి హత్య
అమరావతి: గుంటూరు జిల్లాలో మొండెం లేని తల కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలోని హ్యాపీ క్లబ్ వద్ద మొండెం లేని తల మంగళవారం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలను స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన అనంతరం వాహనం నుంచి వెళుతూ నిందితులు తలను హైవైపై నుంచి విసిరేసే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పాణ్యం రైల్వే స్టేషన్లో ఇద్దరి దారుణ హత్య
కర్నూలు జిల్లా పాణ్యం రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. హతులను దార లక్ష్మయ్య(26), దార ఓబులేసు(28)గా పోలీసులు గుర్తించారు. గుర్తి తెలియని వ్యక్తులు ఇద్దరినీ అత్యంత దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు.
ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం. జిల్లాలోని బోయ ఉప్పలూరు గ్రామంలో జరిగిన రామకృష్ణ అనే వ్యక్తి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులుగా ఉన్నారు. రామకృష్ణ బంధువులే ఈ హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ జంట హత్యలపై సమాచారం అందుకున్న పాణ్యం డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ పార్ధసారధిరెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.