జగన్ని కల్సిన షర్మిల, హరి: ఆ ఇద్దరికీ ఎర్రబెల్లి సవాల్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల మంగళవారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన సమైక్య శంఖారావ యాత్ర వివరాలు చెప్పారు. షర్మిల యాత్ర సోమవారం సాయంత్రం ముగిసింది. దీంతో ఆమె ఉదయం విశాఖ నుండి నేరుగా హైదరాబాదుకు వచ్చారు. అనంతరం జైల్లో ఉన్న జగన్ను కలిశారు.
షర్మిలతో పాటు ములాఖత్ సమయంలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కూడా కలిశారు. ఆయన అనకాపల్లి నుండి కాంగ్రెసు పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆయన కాంగ్రెసు పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ కొంతకాలంగా జగన్కు మద్దతు పలుకుతున్నారు. ఈయన అధికారికంగా జగన్ పార్టీలో చేరే అవకాశముంది.
షర్మిల ఆస్తులు ప్రకటించగలరా?: ఎర్రబెల్లి
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల, ఆ పార్టీ ఇతర నేతలు ఆస్తులు ప్రకటించే దమ్ముందా అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు, మరో నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణలో టిడిపి హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలు చెబుతుంటే కెటిఆర్కు వినిపించడం లేదా అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం నాడు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫాంహౌస్కే పరిమితమయ్యారన్నారు.