జగన్ ఆశీర్వాదం తీసుకొని బయల్దేరిన షర్మిల, బాబుపై శ్రీకాంత్ ఫైర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పరామర్శ యాత్ర ప్రారంభించనున్నారు. ఉదయం లోటస్ పాండు నుండి ఆమె పాలమూరుకు బయలుదేరారు. సోదరుడు జగన్, తల్లి విజయమ్మ ఆమెను ఆశీర్వదించారు.
లోటస్ పాండు నుండి బయలుదేరిన షర్మిల ఇబ్రహీంపట్నం వద్ద వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుండి ర్యాలీగా మహబూబ్ నగర్ జిల్లాకు బయలుదేరారు. కల్వకుర్తి నుండి ఆమె పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలో ఆమె 21 కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఈ 21 కుటుంబాలు 9 నియోజకవర్గాలలో ఉన్నాయి. జిల్లాలోని 13 నియోజకవర్గాలుగా ఆమె యాత్ర ఉంటుంది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు సాగనుంది.
షర్మిల చేపడుతున్న పరామర్శ యాత్రకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలో కోట్లమంది అభిమానులున్నారన్నారు. కాబట్టి తప్పకుండా షర్మిల యాత్ర విజయవంతమవుతుందన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. యాత్రలో షర్మిల వెంట పొంగులేటి కూడా ఉంటారు.
టీడీపీ ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బాబు వస్తే జాబు అంటూ నిరుద్యోగాలను మోసం చేశారన్నారు. రైతులు, మహిళలను నిలువునా మోసం చేశారన్నారు.