కెసిఆర్తో ఎక్కువసేపు షిండే: టి బిల్లుపైనే మంతనాలా?
న్యూఢిల్లీ: అఖిల పక్ష భేటీ నేపథ్యంలో ఒక్కో పార్టీకి ఇరవై నిమిషాల సమయం ఇచ్చిన మంత్రుల బృందం (జివోఎం)తో తెలంగాణ రాష్ట్ర సమితి మిగిలిన పార్టీల కంటే కాసేపు ఎక్కువగా భేటీ అయింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇరవై నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
మంగళవారం మజ్లిస్, బిజెపి, సిపిఐ, కాంగ్రెసు పార్టీల తర్వాత ఆఖరున తెరాస భేటీ అయింది. తెరాస తరఫున కెసిఆర్, సీనియర్ నేత కె కేశవ రావు జివోఎం భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో వారు ఆంక్షలు లేని తెలంగాణ కావాలని, హైదరాబాదును ఐదేళ్లు రాజధాని చేయాలని కోరినట్లు కెసిఆర్ చెప్పారు.

తెరాస వాదనలు వినిపించిన అనంతరం కెసిఆర్, షిండేలు మరో ఇరవై నిమిషాలు మంతనాలు సాగించారట. సమావేశం ముగిసి కేంద్ర మంత్రులంతా తమ కార్యాలయాలకు వెళ్లిపోయిన తరువాత వారిద్దరు విడిగా చర్చలు జరిపారు. తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎప్పుడు ప్రతిపాదించాలనే అంశంతో పాటు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పరిధి ఎంత ఉండాలనేది చర్చించి ఉంటారని అంటున్నారు. కాంగ్రెస్లో తెరాస విలీనం వ్యవహారాన్నీ మాట్లాడి ఉండొచ్చంటున్నారు.
షిండే ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎప్పుడు ప్రతిపాదిస్తారనేది కెసిఆర్కు చెప్పి ఉంటారని అంటున్నారు. అందుకే ఆయన డిసెంబర్లో ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరువాతే కాంగ్రెస్లో తెరాస విలీనం గురించి ఆలోచిస్తానని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications