కేసీఆర్, విజయశాంతిలా మీరెందుకు చేయరు?: ఏపీ ఎంపీలపై శివాజీ ఫైర్
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎలాంటి పోరాటం చేయలేదని సినీ హీరో శివాజీ మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం ఆ రోజున కేవలం ఇద్దరే ఇద్దరు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేత విజయశాంతి లోక్ సభను సాగనివ్వకుండా అడ్డుపడి, తెలంగాణ సాధించుకున్నారని చెప్పారు.
కానీ, ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు నోరుమెదపట్లేదని నాటి విషయాలను హీరో శివాజీ ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయమై కేంద్రమత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్రానికి చెందిన మిగిలిన బీజేపీ నేతలు, మంత్రులు అసలు ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు.
'మనసు విప్పి పోరాటానికి సిద్ధంకండి. ప్రత్యేకహోదా ఎందుకు రాదో.. తేలుద్దాం. ఈ కాంగ్రెస్ నాయకులు.. ఆ రోజున బిల్లులో పెట్టేది ఓకే చేసుంటే పోయేది కదా! ప్రత్యేకహోదాపై నోటిమాట కన్నా బిల్లులో పెట్టేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు కదా?' అని ప్రశ్నించారు.
ఏపీ ప్రత్యేక హోదాపై ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప, మిగిలిన మంత్రులెవ్వరూ మాట్లాడట్లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు, బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని అన్నారు. ఏపీ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు వాళ్ల వ్యాపారాలు, లావాదేవీలు తప్పా ఏపీ ప్రజల గోడు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.