హైదరాబాద్ పొరపాటు వద్దు: శివరామకృష్ణన్ కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన హైదరాబాద్ విషయంలో చేసిన పొరపాటు చేయకూడదని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. అంతా హైదరాబాదులో కేంద్రీకృతం కావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెంది, మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, దానివల్లనే విభజన సమయంలో హైదరాబాద్ వివాదంగా మారిందని చెప్పింది.
స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన కొత్త రాజధానులపై శివరామకృష్ణన్ కమిటీ వివరించింది. 115 చదరపు కిలోమీటర్ల పరిధిలో చండీగఢ్, 177 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గాంధీనగర్, 419 చదరపు కిలోమీటర్ల పరిధిలో భువనేశ్వర్లను రాజధానులుగా అభివృద్ధి చేశారని, ఆంధ్రప్రదేశ్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయని, అందువల్ల ఒక సూపర్ సిటీ కోసం అన్వేషణ సరి కాదని వివరించింది. రాష్ట్రంలోని వివిధ నగరాల మధ్య ఇప్పటికే ఉన్న రోడ్డు, రైలు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి, విస్తరించి పాలనా కేంద్రాలను వికేంద్రీకరించాలని కమిటీ వివరించింది.
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక, పర్యావరణ పర్యవసానాలుంటాయని, వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చేస్తారని, దీనివల్ల వ్యవసాయంపై ఆధారపడిన వారి ఉపాధి దెబ్బతింటుందని కమిటీ తెలిపింది. చిన్న, సన్నకారు రైతులు మాయమైపోతారని, రియల్టర్లు రెచ్చిపోతారని వివరించింది. గురువారంనాడు శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటును పునరావృతం చేయడమే. కొన్ని కమిషనరేట్లు, డైరెక్టరేట్లను వాటి పనితీరు స్వభావాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవచ్చునని తెలిపింది.
కర్నూలు, అనంతపురం, ధర్మవారం, మదనపల్లె, హిందూపురం, తిరుపతి, చిత్తూరులను కమిటీ ‘రాయలసీమ చాపం' అభివర్ణించింది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును తిరిగి రాజధాని చేయాలనే డిమాండ్ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ నగరానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని విస్మరించరాదని తెలిపింది. హైదరాబాద్-కర్నూలు-అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారి గురించి ప్రస్తావించింది.
మీడియా కథనాల ప్రకారం - కాళహస్తి నుంచి నడికుడి వరకు ఉన్న 300 కిలోమీటర్ల ‘రేఖ' మరో అతిముఖ్యమైన ప్రాంతమని కమిటీ తెలిపింది. రైల్వేపరంగా ప్రాధాన్యం ఉందని పేర్కొంది. వైజాగ్-చెన్నై కారిడార్తో సమాంతరంగా అభివృద్ధి చేయవచ్చునని తెలిపింది. కృష్ణపట్నం, దుగరాజపట్నం రేవులనూ అనుసంధానించవచ్చునని పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ఈ ‘రేఖ' ఉపయోగపడుతుందని తెలిపింది.