హైకోర్టులో రోజాకు చుక్కెదురు: మిగిలింది 2 మార్గాలు, 'స్పీకర్దే నిర్ణయం!'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు హైకోర్టులో డివిజన్ బెంచ్లో మంగళవారం నాడు చుక్కెదురైంది. రోజా పైన సస్పెన్షన్ వేటులో అసంబ్లీ కార్యదర్శి వాదనను డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ తీర్పును పక్కన పెట్టింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చింది.
కాగా, ఈ తీర్పును వైసిపి సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశముంది. ఇప్పుడు రోజా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణ చెప్పడం, రెండోది సుప్రీం కోర్టుకు వెళ్లడమే.
స్పీకర్ సుప్రీం!
రోజా అసెంబ్లీలోకి అడుగు పెట్టని విధంగా డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన అనంతరం, ఓ న్యాయవాది మాట్లాడుతూ... సింగిల్ బెంచ్ వద్ద ప్రభుత్వం వారం లోపు కౌంటర్ దాఖలు చేయాలన్నారు. న్యాయస్థానంలోను హౌజ్ ఈజ్ సుప్రీం అని తేలిందని అభిప్రాయపడ్డారు.
తద్వారా స్పీకర్దే తుది నిర్ణయమని అభిప్రాయపడ్డారు. శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని, ఎవరి నిబంధనలు వారికి ఉంటాయని చెప్పారు. ప్రతి వ్యవస్థకు లక్ష్మణ రేఖ ఉంటుందన్నారు.
కాగా, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్ రావులతో కూడిన ధర్మాసనం.. ఈ వ్యవహారంపై మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటించింది.
శాసన వ్యవహారాల కార్యదర్శి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది పీపీ రావు వాదనలు వినిపించారు. రోజా అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతోనే ఏడాది సస్పెండ్ చేశారని, ఆమె దాఖలుచేసిన వ్యాజ్యంలో ఆ వ్యాఖ్యలను ఖండించలేదన్నారు.
సస్పెన్షన్కు ప్రతిపాదించిన తీర్మానంలో ఏపీ శాసన సభ నిబంధన 340(2)గా పొరపాటుగా పేర్కొన్నప్పటికీ ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం సభకు ఉందా? లేదా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అధికరణ 194(3) ప్రకారం సస్పెండ్ చేయడానికి విశిష్ట అధికారం ఉంటుందన్నారు.
అభ్యంతరకర వ్యాఖ్యలపై క్షమాపణలు కోరితే అంగీకరిస్తారా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు లాయర్ సమ్మతం తెలిపారు. తీర్మానం ప్రతిలో నిబంధన 340(2) తప్పుగా పేర్కొనడం చట్టవిరుద్ధం కాదని, ఇలాంటి వ్యవహారంలో కోర్టుల జోక్యం తగదన్నారు.
ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం కేవలం స్పీకర్ది కాదని, అది శాసన సభ నిర్ణయమన్నారు. గతేడాది డిసెంబర్ 18న రోజాను సస్పెండ్ చేస్తే ఆమె ఈ ఏడాది ఫిబ్రవరి 10న కోర్టును ఆశ్రయించారన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు.
రోజా తరఫున సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. సకాలంలో కోర్టును ఆశ్రయించలేదనడం సరికాదన్నారు. సస్పెన్షన్ వ్యవహారం శాసనసభకు చెందినదైతే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సర్కారు ఎందుకు అప్పీల్ చేసిందని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో అప్పీల్కు విచారణార్హత లేదన్నారు. కోర్టుకు చెబుతున్న విషయాలన్నీ అప్పీల్లో పేర్కొనలేదని, తీర్మానంలో నిబంధన పొరపాటుగా పేర్కొన్నామని సభ తరఫున ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదన్నారు. నిబంధన 340(2) ప్రకారం సస్పెన్షన్ గరిష్ఠ కాలం ఆ ఒక్క సెషన్ మాత్రమేనని తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి గతంలో స్పీకర్గా పని చేసిన అనుభవం ఉన్నవారని, ఆయనకు నిబంధనలు తెలుసన్నారు.
ఈ సందర్భంలో ధర్మాసనం స్పందిస్తూ.. సభానాయకుడిపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఎక్కడా రోజాను సభలోకి అనుమతించాలని చెప్పలేదు కదా? అని ప్రశ్నించింది.
ఇరువైపుల న్యాయవాదులు అంగీకరిస్తే శాసనసభ వచ్చే సమావేశం నాటికి రిట్ పిటిషన్ను పరిష్కరించాలని సింగిల్ జడ్జికి సూచిస్తామని కోర్టు ప్రతిపాదించింది. అందుకు రోజా తరఫు న్యాయవాది నిరాకరించారు. తన వాదనలు కొనసాగిస్తూ అప్పీల్దారు చెబుతున్నట్లు 194(3) అధికరణం ప్రకారం చర్యలు తీసుకోవాలంటే చాప్టర్ 20లోని నిబంధనలను అనుసరించాలని, అందుకు ముందుగా నోటీసు ఇవ్వాలన్నారు.
తీర్మానంలో నిబంధననలు తప్పుగా పేర్కొంటే దాన్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అధికారం సభకు ఉంటుందన్నారు. నిబంధన విషయంలో సభలో దొర్లిన పొరపాటును కోర్టు ద్వారా సరిదిద్దుకోలేరని, పొరపాటు దొర్లిందని సభ తరఫున రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం తగదన్నారు.
న్యాయవాది పీపీరావు ప్రతివాదనలు వినిపిస్తూ.. శాసనసభ వ్యవహారాల మంత్రి సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అప్పీల్ దాఖలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. నిన్న, వాదనల అనంతరం ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.