మేయర్ కొడుకు సహా చింటూ టార్గెట్ 5గురు, ఎయిర్పోర్ట్లకు లేఖ: పోలీస్పై బాబు ఆగ్రహం
చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య నేపథ్యంలో... పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మేయర్ దంపతులను చంపింది సూత్రధారి, పాత్రధారి చింటూనే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Photos: అనురాధ అంతిమయాత్ర
చింటూ టార్గెట్లో ఐదుగురు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వారి టార్గెట్లో మేయర్ దంపతులు సహా, మేయర్ కొడుకు, ఓ కార్పోరేటర్ ఉన్నారని సమాచారం. హత్యకు ముందు గంట నుంచి మేయర్ వెంటే రెక్కీలో పాల్గొన్నారని పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం.
మేయర్ దంపతులను హత్య చేయాలని వ్యూహం రచించిన చింటూ తన సన్నిహితులు మంజునాథ్, వెంకటేష్, కిరాయి హంతకుల సాయం తీసుకున్నాడని సమాచారం. మేయర్ దంపతులతో పాటు, మేయర్ తనయుడు ప్రవీణ్, ఓ కార్పోరేటర్ కమలప్రసాద్ అలియాస్ కంద, మేయర్ భర్త మోహన్కు నమ్మిన బంటుగా ఉన్న ప్రసన్నను హత్య చేసేందుకు స్కెచ్ వేశాడని తెలుస్తోంది.
మేయర్ దంపతుల పైన దాడి అనంతరం... చింటూతో పాటు దుండగులు, కందా ఎక్కడ అంటూ గదుల్లో వెతికి పారిపోయారని తెలుస్తోంది. కందా మరో గదిలో దాక్కోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడి ఘటనలో దుండగులు రెండు పిస్టళ్లను వాడారని సమాచారం.
Photos: మేయర్ అనూరాధ దంపతుల హత్య
రెండు పిస్టళ్లలో ఒకదానిని మరుగుదొడ్డిలో పడేసి పారిపోయారు. మరొక పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
పోలీసులు నిందితులను చిత్తూరు సమీపంలోని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. పారిపోతూ పట్టుబడ్ వ్యక్తి చింటూగా భావిస్తున్నారు. అతను పోలీసుల అదుపులో లేడని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు, కటారి దంపతుల హత్య నేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ వైఫల్యం పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
అన్ని విమానాశ్రయాలకు లేఖ
దేశంలోని అన్ని విమానాశ్రయాలకు చిత్తూరు పోలీసులు లేఖ రాశారు. మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న చింటూ ఫోటోను, పూర్తి వివరాలను విమానాశ్రయ అధికారులకు అందించారు.