శ్రీవారి భక్తుల కోసం ఇకపై..
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,602 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,280 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 నుండి 26 గంటల సమయం పట్టింది.
శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఈ సమీక్ష ఏర్పాటైంది. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణ, సంబంధిత విభాగాల సిబ్బంది సేవకులతో నడుచుకోవాల్సిన విధానం, సేవకుల నుండి ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు
• భక్తులకు అత్యుత్తమ సేవలను అందించడంలో భాగంగా, విధులు ముగిసిన తర్వాత శ్రీవారి సేవకుల నుంచి అభిప్రాయాలు, అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి. వారి నుంచి అందే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి.
• శ్రీవారి సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పారదర్శకంగా అమలు చేయాలి.
• సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. దీనికి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ కేటాయించాలి. దీనిద్వారా వారి నుంచి అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కారించేలా ఓ వ్యవస్థ తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది.
• టీటీడీలోని వేర్వేరు విభాగాల్లో పని చేస్తోన్న శ్రీవారి సేవకులకు అప్పగించాల్సిన బాధ్యతలపై ఆయా విభాగాధిపతులు స్పష్టత ఇవ్వాలని, శ్రీవారి సేవకుల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
• సత్సంగ కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మిక వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు.
• తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలు, నైతిక, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
• భక్తులు, సేవకులు, ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు.
• రిటైర్డ్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచన.












Click it and Unblock the Notifications