ఏఓబీ మావో ఎటాక్: చెట్టు మీద ఎస్సై మృతదేహాం.. పోలీసులు షాక్
చెట్టుపై చిక్కుకున్న వ్యాన్ విడిభాగాలను తీసే క్రమంలో పోలీసులు ఎస్సై మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు.
విజయనగరం: పోలీసులపై మావోయిస్టుల ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. గతేడాది ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు 24మంది మావోయిస్టులను మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఏపీ-ఒడిశా సరిహద్దులో ఒడిశా సాయుధ బలగాలపై(ఓఎస్ఏపీ) మావోయిస్టులు తెగబడ్డారు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సుపై మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇందులో ఎనిమిది మంది చనిపోగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఓ ఎస్సై స్థాయి అధికారి, మరో పోలీస్ అధికారి ఆచూకీ లభ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామునే పోలీసులు ఏఓబీలో కూంబింగ్ మొదలుపెట్టారు. కూంబింగ్ లో కొన్ని అవశేషాలు సేకరించారు. ఇదే క్రమంలో ఓ చెట్టుకు చిటారు కొమ్మన వేలాడుతున్న ఎస్సై మృతదేహాన్ని గుర్తించారు. పేలుళ్ల ధాటికి ఎస్సై మృతదేహాం వ్యాన్ నుంచి 25 అడుగుల ఎత్తున పైకి ఎగిరి చిటారు చెట్టు కొమ్మలపై పడింది.
చెట్టుపై చిక్కుకున్న వ్యాన్ విడిభాగాలను తీసే క్రమంలో పోలీసులు ఎస్సై మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ఆచూకీ కోసం పోలీసులు ఏఓబీని జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం భారీ బలగాలతొ పాటు డాగ్ స్క్వాడ్, యాంటీ బాంబ్ స్క్వాడ్, కూంబింగ్ దళాలతో పోలీసులు వేట ప్రారంభించినట్టు తెలుస్తోంది.