అమరావతి: ఏపీకి భారం లేకుండా.. తమ పెట్టుబడిపై సింగపూర్ ప్లాన్
రాజమండ్రి: తాము పెట్టే పెట్టుబడిని ఏపీ ప్రభుత్వం తన ఖజానా నుంచి చెల్లించవలసిన అవసరం లేకుండా సింగపూర్ తలపోస్తోందని తెలుస్తోంది. అందుకోసం రాజధాని ప్రాంతంలో వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల నిర్మాణాలను తాము చేపట్టి, వాటి విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో పెట్టుబడిని రాబట్టుకోవాలనే సింగపూర్ తలపోస్తోందని అంటున్నారు.
అంతర్జాతీయ వసతులతో అభివృద్ధి చేసి అక్కడి భవనాలకు ఆ స్థాయి విలువ తేవడం ద్వారా పెట్టుబడిని రాబట్టుకోవాలని చూస్తోందంటున్నారు. కొన్ని యాంకర్ పరిశ్రమల ఏర్పాటుతోను అమరావతి భూముల విలువ పెంచాలని యోచిస్తోందని అంటున్నారు.
సింగపూర్ తెచ్చే పరిశ్రమలకు నీరు, విద్యుత్, భూమి, పన్ను రాయితీలు మాత్రం ఏపీ ప్రభుత్వం బాధ్యత. ఈ వ్యూహం అమలైతే రాజధాని నిర్మాణానికి పెట్టుబడి పెట్టిన వారికి పెట్టుబడి రావడంతో పాటు ప్రభుత్వ ఆస్తులు, భూములకు విలువ పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
కాగా, స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేసేందుకు సింగపూర్ బృందం అంగీకరించింది. 2018 నాటికి సీడ్ క్యాపిటల్లో ప్రభుత్వ భవన సముదాయలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, జపాన్, చైనాలను కూడా రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేలా చేసే విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సింగపూర్కు చెందిన రెండు టౌన్ షిప్ డేవలపర్స్ ఏపి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునేందుకు బిడ్లు వేసేందుకు ముందుకొచ్చాయని తెలుస్తోంది.