తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు..
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ (SIT) దాఖలు చేసిన చార్జిషీట్లోని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు ఏమాత్రం లేదని సీబీఐ స్పష్టంగా తేల్చింది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ఈ వ్యవహారంపై తాజా నివేదికతో పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణలతో విచారణ..
కాగా టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవడంతో.. ఈ అంశం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపింది. భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని సీబీఐకి అప్పగించింది. సీబీఐ లోతైన స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేసింది. విచారణలో భాగంగా సీబీఐ గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB)ను ఆశ్రయించింది.

2025 జనవరి 8న NDDBకి అధికారిక లేఖ రాసి, లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నమూనాలను తిరిగి పరీక్షించాలని కోరింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. సీబీఐ అభ్యర్థన మేరకు NDDB ఆధునిక ల్యాబ్లలో నెయ్యి నమూనాలపై విస్తృత పరీక్షలు నిర్వహించింది. అనంతరం 2025 మార్చి 27న సీబీఐకి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైనదని, జంతు కొవ్వు లేదా ఇతర కల్తీ పదార్థాల ఆనవాళ్లు లేవని స్పష్టంగా పేర్కొంది.
ఈ నివేదికతో తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలకు పూర్తిగా తెరపడింది. భక్తుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలు నివృత్తి అయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదని, భవిష్యత్తులోనూ మరింత కఠిన ప్రమాణాలు పాటిస్తామని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి. సీబీఐ నివేదికతో తిరుమల దేవస్థానం ప్రతిష్టకు భంగం లేదని స్పష్టమైంది. లడ్డూ ప్రసాదం స్వచ్ఛతపై భక్తులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై తప్పుడు ప్రచారాలకు కూడా ఇకపై చెక్ పడినట్టేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications