కోనపురి రాములు హత్య కేసులో పురోగతి: 6గురి అరెస్ట్
హైదరాబాద్: మాజీ మావోయిస్టు నేత సాంబశఇవుడి సోదరుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కోనాపురి రాములు హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కేరళలోని త్రివేండ్రంలో రాములు హత్య కేసు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రివేండ్రంలోని లాడ్జిలో వారిని పట్టుకున్నారు. వారు నయీం ముఠా సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, కొనాపురి రాములు తుపాకీ గుళ్లకు బలైన విషయం తెలిసిందే. ఒక కార్యక్రమం కోసం మిర్యాలగూడ రోడ్లోని ఫంక్షన్ హాలుకు వచ్చిన రాములును కొందరు వ్యక్తులు చుట్టుముట్టి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి రాములు ముఖంపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.
ఆయన అనుచరులు, చుట్టుపక్కల జనం తేరుకునేసరికే అక్కడినుంచి పరారయ్యారు. ఆ సమయంలో తెరాస అగ్రనేతలు కెసిఆర్, హరీశ్ రావు అక్కడకు దగ్గర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉండటంతో తెరాస శ్రేణులు నివ్వెరపోయాయి. మాజీ నక్సల్ నయీం ముఠానే హత్యలకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రాములు హంతకులను వెంటనే అరెస్టు చేయాలని కెసిఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నయీం ముఠా నుంచి ప్రాణభయం ఉన్నదని రాములు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా రోజుల క్రితమే నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. అయితే, ఆయన హత్యకు ఆగంతకులు నల్గొండనే ఎంచుకొన్నారు.