ఆరేళ్ళ బాలుడిపై 5 వీధికుక్కల దాడి; గుంటూరులో దారుణ ఘటన!!
తెలుగు రాష్ట్రాల్లో కుక్కల గోల భయంకరంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా వీదికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కల దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులలో చిన్నారులు మృతి చెందుతున్న ఘటనలు కూడా బాగా పెరిగిపోయాయి.
కుక్కల నియంత్రణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా, లెక్కకు మిక్కిలి కుక్కలు తెలుగు రాష్ట్రాల్లో తెగబడుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది.

గుంటూరు నగర మేయర్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఆరేళ్ళ బాలుడు కార్తికేయపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా, బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయాన్నే కరాటే తరగతులకు వెళ్లి వస్తున్న బాలుడు కార్తికేయపై ఐదు కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో అటు వెళ్తున్న వాహనదారుడు సకాలంలో స్పందించి బాలుడిని కుక్కల బారి నుండి కాపాడాడు.
సెలవులు కావటంతో కార్తికేయ చుట్టాలింటికి వచ్చాడు. అక్కడ కరాటే తరగతులకు కార్తికేయ హాజరవుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.ప్రస్తుతం బాలుడిపై కుక్కలు దాడి చేయటంతో తల్లిదండ్రులు హుటాహుటిన గుంటూరుకు బయలుదేరారు, తమ కొడుకు పరిస్థితిపై వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
గుంటూరు జిల్లాలో దారుణం-ఆరేళ్ల బాలుడిపై దాడి చేసిన కుక్కలు. గాయపడిన బాలుడు..!! pic.twitter.com/2F2oJp0XCZ
— oneindiatelugu (@oneindiatelugu) December 30, 2023
ఇక ఆరేళ్ళ బాలుడిపై వీదికుక్కలు దాడి చేసిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల కట్టడిలో గుంటూరు కార్పోరేషన్ అధికారులు విఫలం అయ్యారని వారు చెప్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని కుక్కల బారి నుండి కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications