మొంథా తుఫాన్ పై సోషల్ మీడియా పోస్టులు.. వారికి తీవ్ర హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాను తీవ్ర రూపం దాల్చి తీరం సమీపానికి చేరుకుందని వాతావరణ శాఖ చెబుతోంది.ఈ తుఫాను రాజోలు అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం
ఈరోజు రాత్రి 11 గంటల 30 నిమిషాల తర్వాత ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో అధికారులు అన్ని జిల్లాలలోనూ అలర్ట్ అయ్యి సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాలలో సహాయక చర్యలను చేపడుతున్నాయి.

సోషల్ మీడియాలో తుఫానుపై తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే చర్యలు
ఇదిలా ఉంటే మొంథా తుఫానుపై సోషల్ మీడియా వేదికగా రకరకాల సమాచారం వైరల్ అవుతుంది. దీంతో అనకాపల్లి జిల్లా ఎస్పీ సోషల్ మీడియాలోమొంథా తుఫాను పై తప్పుడు సమాచారాన్ని పంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మొంథ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు మరియు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలియజేశారు.
రూమర్లు లేదా భయాందోళన కలిగించే పోస్టులపై చర్యలు
సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లు మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారం, రూమర్లు లేదా భయాందోళన కలిగించే పోస్టులు పంచరాదని ఆయన అన్నారు. అటువంటి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసిన లేదా ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
ప్రజలు అధికారిక సమాచారమే నమ్మాలని విజ్ఞప్తి
ప్రజలు కేవలం ప్రభుత్వం, వాతావరణ శాఖ మరియు జిల్లా పోలీసు అధికారుల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, రూమర్లను వ్యాప్తి చేయకుండా సహకరించాలని ఎస్పీ సూచించారు. జిల్లా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. అనవసరపు రూమర్ లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు అవసరం అయితే పోలీసులను, ఎమర్జెన్సీ సేవలను సంప్రదించాలి
అంతేకాకుండా, ఎస్పీ తుహిన్ సిన్హా ఈ రోజు అనకాపల్లి పట్టణంలోని ఆర్.ఓ. ఆఫీస్ మరియు గుండాల వద్ద ఉన్న ఎన్.డి.ఆర్.ఎఫ్ (NDRF) సిబ్బందిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి జిల్లా పరిధిలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించి, ప్రాణ, ఆస్తి రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి అని ఆదేశించారు. మొంథ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీసు లేదా అత్యవసర సేవలను సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications