అందుకే వైసిపి నుంచి టిడిపిలోకి: సోమిరెడ్డి, 'వైసిపి ఖాళీ అవుతుందా'
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వేగలేక ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని టిడిపి శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు.
రానున్న రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. జగన్ తొలుత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ సైంధవుడిలా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రేపు (శనివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు సహా నలుగురు కేంద్రమంత్రులు నెల్లూరు రానున్నారని చెప్పారు. 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును జాతికి అంకితం చేయనున్నారని చెప్పారు.
ఫిరాయింపులు ఎలా ఆపాలి?
వైసిపి నుంచి టిడిపిలోకి జరుగుతున్న వలసలను ఆపేందుకు జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలోకి ముప్పై మంది వరకూ ఎమ్మెల్యేలు రానున్నారని స్వయంగా టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ మైండ్ గేమ్ ఆడుతున్న నేపథ్యంలో జగన్ జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు.
గురువారం కడప జిల్లా నేతలతో సమావేశమై చర్చించిన జగన్ ఈ రోజు (శుక్రవారం) గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను హైదరాబాదుకు రావాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన, సాయంత్రం గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
ప్రధానంగా వలసలను ఆపడం పైనే జగన్ దృష్టిని సారిస్తున్నారు. ఎమ్మెల్యేల సమస్యలు, టిడిపి నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లపై ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. మార్చి 5వ తేదీ లోపు వైసీపీ ఖాళీ అవుతుందని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. మైసూరా రెడ్డి వంటి నేతలు కూడా పార్టీ వీడవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఆత్మరక్షణలో పడ్డారు.