తెలంగాణవాళ్లు ఏపీలో కలవాలనుకుంటారు: సోమిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవాలనుకునే రోజు వస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఆ పరిస్థితి మారే రోజు త్వరలోనే వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. అధికారుల కారణంగా టీడీపీ కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకోమన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు.
మహానాడు లాంటి సభను ఎప్పుడైనా నిర్వహించారా అని ప్రశ్నించారు. గత పదేళ్ల కుంభకోణాలన్నింటితోను కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయన్నారు. అవినీతితో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని చెప్పారు. ప్రధాని మోడీని ప్రజలు అభినందిస్తున్నారని, అది చూసి కాంగ్రెస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు.
తమ పార్టీ యువనేత నారా లోకేష్ పైన ఏ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలన్నారు. అన్నపూర్ణ లాంటి ఏపీని అవినీతి ఏపీగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అందరు అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ రికార్డ్ సృష్టించిందన్నారు.
మా పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుగానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు అవినీతికి పాల్పడలేదన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా అవినీతికి దూరంగా ఉన్నారని చెప్పారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలు చేతనైతే మెరుగైన పాలన కోసం సలహాలు ఇవ్వాలన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి బానిసలుగా బతికారని విమర్శించారు. బొత్స, రఘువీరాకు కళ్లు మూసుకుపోయాయని, అందుకే సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.