కరోనా కష్టకాలంలో సామాన్యుడిపై భారం మోపుతారా?: ఏపీ సర్కారుపై సోము వీర్రాజు ఫైర్
అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల హామీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ.. కరోనా కష్టకాలం లో కరెంట్ చార్జీలు పెంచి సామాన్యుడిపై పెను భారం మోపారని మండిపడ్డారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఐదేళ్ల క్రితం వాటి ఖర్చుల వ్యత్యాసం వసూళ్ల కోసం ఇప్పుడు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు కరెంటు బిల్లులకు లింకు పెట్టిన నేపధ్యంలో ఈ అదనపు భారం వల్ల పింఛన్లు కోల్పోతామన్న భయంతో లబ్ధిదారులు ఉన్నారని సోము వ్యాఖ్యానించారు. 3,800 కోట్ల రూపాయలు వరకు సర్దుబాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇంటి మీద చార్జీల భారం వేస్తున్నారని సోము విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల వైఫల్యాలకు ప్రజలు ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యుత్ వినిమయం తగ్గినా ఇతర కారణాలు చూపిస్తూ విద్యుత్ సంస్థలు మరోసారి ఈ అదనపు వ్యయాన్ని సామాన్యుని పై రుద్దేందుకు చూస్తున్నాయని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ సంస్థలు సర్దుబాటు పేరుతో అదనంగా విధిస్తున్న ఆర్ధిక భాగాన్ని ప్రభుత్వమే భరించాలని సోము వీర్రాజు ఇవాళ అమరావతిలో డిమాండ్ చేశారు. వినియోగదారులకు భారం వేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు టీడీపీ ఆధ్వర్యంలో జోనల్ వారిగా రైతు కోసం పోరుబాట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మూతపడిందని, వ్యవసాయం సంక్షోభంలో పడిందని చంద్రబాబు వాపోయారు.
రైతులకు జగన్ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు ఆరోపించారు. అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జగన్ మైనార్టీలకు చేసిన ద్రోహం అన్నారు. ఇప్పటికే 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.9వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. కమీషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్ కొని ఆ భారాలు ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మటన్ షాపులు నిర్వహిస్తుందన్న జగన్ వ్యవహారశైలి హాస్యాస్పదంగా మారిందన్నారు.
Recommended Video
వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మైనార్టీ, క్రిస్టియన్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేయడానికి జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. రేషన్, పెన్షన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపులు కొడుతోందన్నారు. పంచాయతీల్లో కూడా ఆస్తి పన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. భవిష్యత్ లో గ్రామాల్లో కూడా చెత్త, పారిశుద్ధ్యంపై పన్నువేస్తారన్నారు.