బాబూ! జాగ్రత్త, గవర్నరేం చేస్తున్నారు: సోము వీర్రాజు, 'వెంకయ్య వద్దకు వైసీపీ వాళ్లను రమ్మంటే'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బరితెగించి నవ్యాంధ్ర ప్రదేశ్లో అవినీతికి పాల్పడుతున్నారని ఏపీ భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు శుక్రవారం మండిపడ్డారు. విమానాశ్రయాలకు సేకరించిన భూమిని ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
చివరకు పాఠశాల భవనాలకు రంగులు వేసే పనులలో కూడా అవినీతి జరుగుతోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు చేస్తున్నదంతా పై నుంచి భగవంతుడు చూస్తున్నారని, ఆయన అవినీతికి పంచభూతాలే సాక్ష్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి తారాస్థాయికి చేరుకుందన్నారు.

చంద్రబాబు అవినీతికి పాల్పడుతుంటే గవర్నర్ ఏం చేస్తున్నారు?
చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతుంటే గవర్నర్ నరసింహన్ ఏం చేస్తున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచభూతాలే సాక్ష్యంగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఉప రాష్ట్రపతి వద్దకు టీడీపీ ఎంపీలు
ఇదిలా ఉండగా, కడప ఉక్కు పరిశ్రమపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును టీడీపీ ఎంపీలు గురువారం కలిశారు. ఈనాడు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో చొరవ చూపాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సుజనా చౌదరి నేతృత్వంలో ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, నిమ్మల కిష్టప్ప, రవీంద్ర కుమార్, కొనకళ్ల నారాయణ, మురళీ మోహన్, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, బుట్టా రేణుక, గల్లా జయదేవ్, కడప జిల్లా జేఏసీ నేతలు వెంకయ్యతో భేటీ అయ్యారు.

వనరులు ఉండి పరిశ్రమ రాకుండా ఉండటం దేశంలో ఎక్కడా లేదు
అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. వెంకయ్య నాయుడుకు కడప పరిశ్రమ విషయంలో చొరవ చూపాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. ఉప రాష్ట్రపతికి అన్ని విషయాలు తెలుసునని, కడప జిల్లాలో జరుగుతున్న ఆందోళనలు వివరించామని చెప్పారు. ఇటీవల ఉభయ సభల్లోనూ జరిగిన చర్చల్లో కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని ఆయనకు చెప్పామన్నారు. వనరులు ఉండి పరిశ్రమ సాధ్యమయ్యే ప్రాంతం దేశంలో మరెక్కడ లేదని వాపోయారు.

వైసీపీ నేతలను రమ్మంటే అవహేళనగా మాట్లాడారు
తన పరిధి మేరకు మంత్రిత్వశాఖతో చర్చిస్తానని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చారని సీఎం రమేష్ అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యను.. జేఏసీతో కలిసి కలవడానికి వెళ్తున్నామని, రమ్మని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెబితే వారు అవహేళగా మాట్లాడారని ఆరోపించారు. కడపలో ఉక్కుపరిశ్రమ రావడం వైసీపీ అధినేత జగన్కు ఏమాత్రం ఇష్టం లేనట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications