బూటకపు కలలు అమ్మేస్తున్నారు: కేంద్రంపై సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 70వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ మాట్లాడారు. మహిళా బిల్లును పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పారు.
యుపిఏ ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టి అమలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో చేస్తున్నామని అవాస్తవ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు తప్పుడు వాగ్ధానాలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందని ఆమె అన్నారు. కొంతమంది తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందారని దుయ్యబట్టారు. బూటకపు కలలను అమ్మకుంటోందని కేంద్రంపై సోనియా ధ్వజమెత్తారు.

మహిళా అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని తెలిపారు. ఏ దేశం కూడా ఆ దేశంలోని సగం ప్రజల భాగస్వామ్యం లేకుండా ముందుకు సాగలేదని తెలిపారు. పంచాయతీలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడంలో రాజీవ్ గాంధీదే కీలక పాత్ర అని చెప్పారు. ఆయన పార్లమెంటు, అసెంబ్లీల్లో కూడా మహిళల సంఖ్య పెరగాలని కోరుకునేవారని తెలిపారు.
2004లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ.. కొన్ని రాజకీయ పార్టీల అడ్డుకోవడం వల్లే ఆగిపోయిందని సోనియా గాంధీ చెప్పారు. తాము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. తాము అధికారం కోసం నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కనపెట్టలేమిన చెప్పారు.
మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయాలని, అన్యాయాలకు గురైన బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలకు సోనియా గాంధీ పిలపునిచ్చారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఈ బిల్లు ఆమోదం పొందితే లభించనున్నాయి. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశలో కొట్టుమిట్టాడుతుందని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. తాము బూటకపు కలలు అమ్మడం లేదని.. తాము వాస్తవంగా జరుగుతున్న అభివృద్ధిని మాత్రమే
చెబుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications