కడపలో ఇప్పుడిదే హాట్ టాపిక్... త్వరలోనే రంగంలోకి సీబీఐ... ఏం జరగబోతుంది..?
కరోనా లాక్ డౌన్ కారణంగా మరుగునపడ్డ వైఎస్ వివేకా హత్య కేసులో త్వరలోనే సీబీఐ దర్యాప్తు ప్రారంభమవనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో త్వరలోనే సీబీఐ కడప జిల్లాలో అడుగుపెట్టనుందన్న ప్రచారం జరుగుతోంది. సీబీఐ రంగంలోకి దిగితే ఎవరిని విచారిస్తుంది.. కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

కడప నేతల్లో హాట్ టాపిక్...
ప్రస్తుతం కడప జిల్లా ముఖ్య నేతల్లో సీబీఐ దర్యాప్తు గురించే చర్చ జరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ సీబీఐ జిల్లాలో అడుగుపెడితే మొదట ఎవరిని విచారిస్తుంది.. ఏయే కోణాల్లో దర్యాప్తు సాగుతుందన్న దానిపై వారు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై పలు ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను వివేకా కుమార్తె సునీత గతంలోనే ఖండించారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలే తప్ప.. తమ కుటుంబంలో ఈ స్థాయి కక్షలు ఎవరి మధ్య లేవని స్పష్టం చేశారు.

గతంలో సిట్.. ఇప్పుడు సీబీఐ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివేకా సొంత చిన్నాన్న కావడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నిరుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న ఆయన హత్యకు గురయ్యారు. సొంత ఇలాఖాలోనే స్వగృహంలో ఆయన హత్యకు గురవడం సంచలనం రేపింది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేయగా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆయన ఆ నిర్ణయం తీసుకోలేదు. చివరకు హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తు తప్పలేదు.
Recommended Video

అన్ లాక్ తర్వాత..
వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వివేకా కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి,ఎమ్మెల్సీ బీటెక్ రవిలు కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటన్నింటిని పరిగణించిన న్యాయస్థానం.. చివరకు సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ విచారణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని జగన్ సర్కార్ను కూడా ప్రశ్నించింది. ఎట్టకేలకు మార్చి నెలలో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే ఇంతలోనే కరోనా వైరస్ విజృంభించడంతో సీబీఐ రంగంలోకి దిగలేదు. తాజాగా దేశవ్యాప్తంగా అన్ లాక్ ప్రకటించడం.. మున్ముందు ఆంక్షలను మరింత సడలించే అవకాశం ఉండటంతో త్వరలోనే సీబీఐ దర్యాప్తు మొదలవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications