విశాఖ - విజయవాడ- తిరుపతి రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఇక నుంచి కొత్తగా..!!
విశాఖ కేంద్రంగా రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ప్రారంభం అయిన తరువాత తీసుకోనున్న నిర్ణయాలను అధికారులు వెల్లడించారు. మౌలిక వసతులు, స్థానిక ప్రజల అవసరాలు, ప్రాజెక్టుల పురోగతి, భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా కొత్త లైన్లు.. రైళ్ల పైనా స్పష్టత ఇచ్చారు. వీటి ద్వారా ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుంది.
దక్షిణ కోస్తా జోన్లో కొత్తగా నాలుగు వరుసల రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్టు జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ వెల్లడించారు. ఇచ్ఛాపురం-విశాఖపట్నం-విజయవాడ-గూడూరు-రేణిగుంట వరకూ ఈ లైన్ల నిర్మాణం ఉంటుందని స్పష్టం చేసారు. ప్రస్తుతం రెండు రైల్వే లైన్లు ఉండగా, మూడో లైన్ నిర్మాణం జరుగుతోందని, త్వరలో నాలుగో లైన్ కూడా వస్తుందని వివరించారు. జోన్లో రూ.54,479 కోట్లతో ఐదు కొత్త రైల్వే లైన్లు, 24 మల్టీ-ట్రాకింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. వీటితో పాటుగా మరో రూ.70,865 విలువైన ప్రాజెక్టులు పైప్లైన్లో ఉన్నాయి. వివిధ డివిజన్లలో మొత్తం 300 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నానికి రూ.300 కోట్ల విలువైన యార్డ్ రీమోడలింగ్ ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు. విశాఖపట్నం స్టేషన్లో అదనంగా ఆరు ప్లాట్ఫారాలు, ప్లాట్ ఫారాల విస్తరణ, ఎలకా్ట్రనిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

విశాఖ నుంచి కొత్తగా వందేభారత్ రైళ్లు
కాగా, రూ.1,205 కోట్లతో గుంతకల్-బళ్లారి మధ్య నాలుగు వరుసల రైల్వే లైన్ ప్రాజెక్ట్, తిరుపతిలో రూ.20 కోట్లతో క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. నరసాపూర్-విజయవాడ, గరుగుబిల్లి-విశాఖపట్నంలలో యార్డు రీమోడలింగ్ పనులు, నెల్లూరు-తెలమంచి సెక్షన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు జరుగుతున్నాయని వివరించారు. డిమాండ్ అధికంగా ఉందన్న కారణంతో నాలుగు ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చామని.. త్వరలో కొత్తగా వందేభారత్ రైళ్లు మరిన్ని జోన్ కు కేటాయిస్తారని వెల్లడించారు. ఈ ఏడాది చివరికి 100 లోకోమోటివ్లకు, 100 కిలోమీటర్ల రైల్వే లైన్కు 'కవచ్' సౌకర్యం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు. దశల వారీగా జోన్ పరిధిలో అన్ని అందుబాటులోకి వస్తాయని చెప్పారు.



Click it and Unblock the Notifications