రఘురామ అరెస్ట్: జగన్ సర్కార్పై లోక్సభ స్పీకర్ విచక్షణాధికారాల ప్రయోగం: జనసేన కీలక సూచన
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రఘురామ అరెస్టు విషయంపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. వైఎస్సార్సీపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలన్నీ ఒకేచోటికి చేరాయి. వాటికి తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం చేస్తోందనేది బహిరంగ రహస్యం. రఘురామకు వైసీపీయేత పార్టీలన్నీ నైతిక మద్దతును ప్రకటించాయి. ఆయన అరెస్ట్ను తప్పుపడుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. రఘురామ అరెస్ట్ వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కీలక సూచనలను ఇచ్చింది. ఈ అరెస్టు విషయంలో ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని కోరింది. దీన్ని సుమోటో కేసుగా స్వీకరించాలని, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటోనన ఎంపీ పట్ల విచారణ పేరుతో పోలీసులు అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోందని, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ కొనసాగించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.
రఘురామ విషయంలో కొందరు అధికారులు చట్టాలకు తూట్లు పొడిచారని, లోక్సభ సభ్యుడిగా ఆయనకు ఉండే హక్కులను కాలరాసినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రఘురామ అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు ఏ మాత్రం సరైంది కాదని అన్నారు. దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని, ఈ కేసును సుమోటోగా తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్గా దీన్ని గుర్తించాలని కోరారు.
పార్లమెంట్ తన విశేష అధికారాలను వినియోగించుకోవాలని అన్నారు. ఎంపీగా రఘురామ కృష్ణంరాజు హక్కులను కాలరాస్తున్నట్లుగా ప్రవర్తించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విశేష అధికారాలను పార్లమెంట్ ఉపయోగించుకోలేకపోతే చట్టసభలకు ఉన్న ప్రాధాన్యత, విశిష్ఠతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము త్వరలోనే లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తామని అన్నారు. ఇతర పార్లమెంట్ సభ్యుల మద్దతును తాము కూడగడతామని చెప్పారు.