తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని - కీలక వ్యాఖ్యలు..!!
స్పీకర్ తమ్మినేని తొడ గొట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. బూర్జి మండలంలో నూతనంగా నియమించిన వాలంటీర్ల నియామక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. అదే సమయంలో తొడగొట్టి మరీ తాను చెప్పదలచుకున్నది చెప్పారు. త్వరలోనే వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసారని ఆరోపించారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని..రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. నిరుద్యోగులకు నెలకు రెండు వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలకు మోసం చేసిన కారణంగానే ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. మళ్లీ జగన్ కే ఓటు వేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడకొట్టి చెప్పిన విషయాన్ని వివరిస్తూ స్పీకర్ తొడకొట్టారు. జగన్ మరోసారి సీఎం అవుతారంటూ మహిళలే భరోసా ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల్లో జగన్ పైన విశ్వాసం కనిపిస్తోందని స్పీకర్ వివరించారు.
చంద్రబాబు తన స్వగ్రామం నారావారి పల్లెలో రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని, ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా మంత్ర దండం ఉందా అని అడిగారు.
ఉంటే దానిని ప్రజలకు అందిస్తే నిరుపేదలు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల కింద త్వరలో ప్రకటన చేయనుందని వెల్లడించారు. ఇప్పుడు స్పీకర్ తొడ కొట్టిన వ్యవహారం సంచలనంగా మారుతోంది.