ప్లాన్ బీ అమలు చేస్తున్న జగన్ సర్కార్ .. నిమ్మగడ్డపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ సర్కార్ ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ కూడా శాసించే స్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని తీవ్ర అసహనంతో ఉన్న మాట తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు అటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం గా మారిన విషయం తెలిసిందే.

ప్లాన్ బీ అమలు చేస్తున్న సర్కార్ .. రంగంలోకి దిగిన మంత్రులు
ఒకరినొకరు టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరిని ఒకరు ఇబ్బందులకు గురి చేయాలని చూడడం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం లోని ఉన్నతాధికారులను టార్గెట్ చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అటు ప్రభుత్వానికి లేఖలు రాస్తూ, ఇటు గవర్నర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా, హై కోర్టును సైతం ఆశ్రయించారు. ఇందుకు కౌంటర్ గా ప్లాన్ బీ అమలు చేయాలని భావించిన సర్కార్ అందుకోసం మంత్రులను రంగంలోకి దింపింది.

నిమ్మగడ్డపై స్పీకర్ కు మంత్రుల ఫిర్యాదు
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణలు శాసనసభ స్పీకర్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ తమ పరిధి దాటి తమ పై వ్యాఖ్యలు చేశారంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై చర్యలకు ఉపక్రమించిన స్పీకర్ .. ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఆదేశం
ఇక వీరి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై చర్యలకు ఉపక్రమించింది.నిమ్మగడ్డ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీకి సోమవారం సిఫార్సు చేశారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ప్రివిలేజ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై విచారణ చేపట్టనుంది. ప్రివిలేజ్ కమిటీ విచారణలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రుల ఫిర్యాదు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లపై గవర్నర్ కు లేఖ రాసి ఫిర్యాదు చేశారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అంటూ వారిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనే మంత్రులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమపై నిందారోపణలు మోపారని అవి తమను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని వారు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో ప్రధానంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications