ప్రత్యేక హోదా: చంద్రబాబుతో మాట్లాడుతాం కుర్చోండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని లోక్ సభలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ధర్నా నిర్వహించారు.
అనంతరం పార్టమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత సభలోకి అడుగు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాకు ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. సభలో కేకలు వేస్తూ నినాదాలు చేశారు.
అదే సమయంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను యథావిథిగా కొనసాగించారు. దీంతో నినాదాలు, అరుపులు ఎక్కువ అయ్యాయి. అయినా స్పీకర్ సుమిత్రా మహాజన్ వాటిని పట్టించుకోకుండా సభ కొనసాగించారు.
వైసీపీకి చెందిన ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బుట్టా రేణుకా, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వరప్రసాద్ తదితరులు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు కొనసాగిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఆ సందర్బంలో జోక్యం చేసుకున్నకేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతుందని, మీరు మీ సీట్లలో కుర్చోవాలని వైసీపీ ఎంపీలకు సూచించారు.
అయితే అనంతకుమార్ మాటలను వైసీపీ ఎంపీలు పట్టించుకోలేదు. స్పీకర్ పోడియం ముందు నిరసనకు దిగారు. వైసీపీ ఎంపీలు ఎంత చెప్పినా మాట వినడం లేదని అనంతకుమార్ స్పీకర్ కు చెప్పారు. తాను చెప్పినా వారు నా మాట వినడం లేదని స్పీకర్ మంత్రికి చెప్పారు. సభలో ప్రత్యేక హోదాపై నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.