జగన్కి షాక్: సిక్కోలు ఎమ్మెల్యే జంప్!, పవన్ కళ్యాణ్-మోడీ కాళ్లు పట్టుకొని: రోజా
శ్రీకాకుళం/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వైసిపి తరఫున కళమట వెంకటరమణ మూర్తి గెలుపొందారు. ఆయన కూడా ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆయన తన కార్యకర్తలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఎల్లుండి లేదా మార్చి 4వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, ఒకటి రెండు రోజుల్లో పూర్తి విషయాలు తెలియనున్నాయని అంటున్నారు.
ప్రపంచంలోనే స్వార్థపరుడు: పల్లె
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే స్వార్థపరుడు, అవినీతిపరుడు అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు.
జగన్ నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఆయన ఇప్పటికీ కోర్టులు, కేసులు అంటూ తిరుగుతున్నారన్నారు. వైసిపిలో చేరిన ఎమ్మెల్యేల విషయమై మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చెప్తే తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
కాగా, అంతకుముందు రోజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ వల్ల ఏపీ భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందన్నారు. వేల కోట్లు దోచుకుంటూ కాల్ మనీ సెక్స్ రాకెట్లో లోకేష్ పాత్ర ఉందని ఆరోపించారు.
ఇన్ని తప్పులు చేసినా దొరక్కుంటా లోకేష్ ఉన్నారన్నారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని లోకేష్ చెబుతున్నారని, ఇంత చిన్న వయస్సులోనే దొరక్కుండా తప్పులు చేస్తున్నారంటే భవిష్యత్తులో ఏపీకి పెనుముప్పు పొంచి ఉందన్నారు. లోకేష్ ఆలోచనలు మొగ్గలోనే తుంచి వేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హీరో పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారన్నారు.