కిడ్నీ బాధితుల గోడు!: పట్టించుకునేవారేరి?, ఆ ఒక్క డాక్టర్ను పంపించేశారు..
శ్రీకాకుళం కిడ్నీ బాధితులు వ్యయ ప్రయాసలకోర్చి విశాఖపట్నం వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వస్తోంది.
శ్రీకాకుళం: కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వారికి కనీస వైద్య సౌకర్యాలు కరువయ్యాయి. ప్రజా ప్రతినిధులంతా మాటలకే పరిమితమవడంతో.. కనీస వైద్య సదుపాయాలు లేక వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆఖరికి జిల్లాలో ఉన్న ఒకే ఒక్క నెఫ్రాలజిస్టును బదిలీ చేయడంతో.. వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.
నిలబెట్టుకోని హామి
గతంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ జిల్లాలోని రిమ్స్లో నెఫ్రాలజీ యూనిట్ ప్రారంభిస్తామని హామి ఇచ్చినప్పటికీ.. ఇంతవరకు దానికి మోక్షం కలగలేదు. హామి ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. కనీసం ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు లేదు. మరోవైపు జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ స్థాయి నెఫ్రాలజీ నిపుణుల కొరత కూడా కిడ్నీ బాధితులకు శాపంగా మారింది.
ఆమె ఒక్కరే:
శ్రీకాకుళం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ స్థాయి శిక్షణ పొందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ జ్యోత్స్న ఒక్కరు మాత్రమే ఉన్నారు. గత కొన్నాళ్లుగా రిమ్స్ మెడికల్ విభాగంలో ఆమె పనిచేస్తున్నారు. నెఫ్రాలజీలో పీజీ డిగ్రీ ఉన్నా స్థానికంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో ఆమె అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు.
జ్యోత్స్న బదిలీతో
జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క నెఫ్రాలజీ నిపుణురాలు జ్యోత్స్నను కూడా ఇప్పుడు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు అందడంతో.. కర్నూలు వైద్య కళాశాలలో నెఫ్రాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరేందుకు గురువారం ఆమె రిలీవ్ అయ్యారు. రిమ్స్ లోనే నెఫ్రాలజీ విభాగం ఉండి ఉంటే ఆమె జిల్లాలోనే ఉండేవారని స్థానికులు అంటున్నారు.
వైద్యులే లేరు
జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు ఉద్దానం కిడ్నీ బాధితులు. ఉద్దానం ప్రాంతంతో పాటు పలు మండలాల్లో కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్నారు. ఒక అంచనా ప్రకారం జిల్లాలో 13,000 మంది కిడ్నీ రోగులు ఉన్నట్టు చెబుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వీరికి చికత్స అందించడానికి నిపుణులైన నెఫ్రాలజీ వైద్యులు ఇప్పుడక్కడ లేరు. దీంతో వ్యయ ప్రయాసలకోర్చి విశాఖపట్నం వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వస్తోంది.