జగన్ కోడి కత్తి కేసు... సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖ
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖ రాశారు. నాలుగు సంవత్సరాల నుంచి తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే శ్రీనివాస్ను విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకానీ, న్యాయస్థానం కానీ ఎటువంటి విచారణ జరపడంలేదని వెల్లడించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై శ్రీనివాస్ కోడి పందేల్లో వాడే కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. 2019 అక్టోబరులో విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అదే నెల 25వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడిచేసిన సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.

సుమారు నాలుగు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని న్యాయనిపుణులు అంటున్నారు. కస్టడీ అనేది ఏదైనా 14 రోజులకే ముగిసిపోతోందని, అలా కాకుండా ఈ కేసును ముందుకు నడిపించే ఉద్దేశం ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితుడిపై నేరం రుజువైతే వెంటనే శిక్ష విధించాలని, పూర్తిస్థాయిలో ఆధారాలు సమర్పిస్తే కోర్టు విచారణ జరిపి శిక్ష విధిస్తుందని, ఆధారాలు రాలేదు అంటే.. కేసు దర్యాప్తు వేగంగా సాగడంలేదని అర్థమవుతోందంటున్నారు. సావిత్రమ్మ రాసిన లేఖపై జస్టిస్ రమణ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications