శ్రీశైలం మల్లన్న భక్తులకు తీపి కబురు- స్పర్శ దర్శనాలు ఇక నుంచి..!!
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శన వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు చర్చించిన ఆలయ అధికారులు తాజా నిర్ణయం వెల్లడించారు. దీని ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వెసులుబాటు కలగనుంది. ఆన్ లైన్ విధానం లోనూ ముందస్తుగానే టికెట్లు పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయం అధికారులు కీలక నిర్ణయం వెల్లడించారు. భక్తుల నుంచి డిమాండ్ మేరకు స్పర్శ దర్శన వేళలను పెంచుతున్నట్లు ప్రకటించారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శన సమయాలను పొడిగించారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేసారు. రానున్న జనవరి నుంచి వారాంతాల్లో ఆరు స్లాట్ల ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు. తాజా నిర్ణయం ద్వారా భక్తులు తమకు అనుకూల మైన సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం దక్క నుంది. వీకెండ్లో వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి నుంచి 8.30 వరకు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఉదయం 10.30 నుంచి 11.30 వరకు వీఐపీ బ్రేక్ ఉంటుంది.

కాగా, అనంతరం ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 7.45 నుంచి 8 గంటల వరకు వీఐపీ బ్రేక్.. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఇక.. ఇప్పటికే భక్తులు ఈ స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లో www.aptemples.ap.gov.in, www.srisailadevasthanam.org వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే విధంగా వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు. రూ.150తో శీఘ్ర దర్శనం, రూ.300తో అతిశీఘ్ర దర్శనం టికెట్లను ఆన్లైన్లోనే కాకుండా, కరెంటు బుకింగ్ ద్వారా కూడా అందుబాటులో ఉంచారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో 14 రకాల సేవలు అన్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా మెరుగైన సేవలు ప్రారంభించారు. స్పర్శ దర్శనం, వసతి, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులకు వెసులు బాటు కలుగుతోంది.












Click it and Unblock the Notifications